శశి థరూర్ ఆస్తులు ఎన్ని కోట్లంటే.. | Sakshi
Sakshi News home page

శశి థరూర్ ఆస్తులు ఎన్ని కోట్లంటే..

Published Fri, Apr 5 2024 3:02 PM

Shashi Tharoor Declares Assets Worth Rs 55 Crore - Sakshi

తిరువనంతపురం: లోక్‌సభ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో అభ్యర్థులు ఇప్పటికే దాదాపు నామినేషన్స్ ప్రక్రియలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ తరుణంలో తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి మూడు సార్లు గెలిచిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ 'శశి థరూర్' మళ్ళీ అక్కడ నుంచే పోటీ చేయడానికి నామినేషన్ వేశారు.

శశి థరూర్ నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇందులో తన వద్ద రూ. 49 కోట్లకుపైగా స్థిరాస్థులు ఉన్నట్లు పేర్కొన్నారు. 19 బ్యాంకు ఖాతాల మొత్తాలలో డిపాజిట్లు, వివిధ బాండ్లు, మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడులు ఉన్నాయని చెప్పారు.

అతని అఫిడవిట్ ప్రకారం.. చరాస్తులలో రూ. 32 లక్షల విలువైన 534 గ్రాముల బంగారం, రూ. 36,000 నగదు ఉన్నట్లు వెల్లడించారు. పాలక్కాడ్‌లోని 2.51 ఎకరాల వ్యవసాయ భూమి, రాష్ట్ర రాజధానిలో రూ. 52 లక్షల విలువైన నివాసం ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా.. ఒక మారుతి సియాజ్ కారు, రెండు మారుతి ఎక్స్ఎల్6 కార్లు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇలా మొత్తం మీద శశి థరూర్ తన నామినేషన్ పత్రాల్లో రూ. 55 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించారు.

2014లో శశి థరూర్ ఆస్తులు విలువ రూ. 23 కోట్లు కాగా.. 2019లో ఆస్తులు రూ. 35 కోట్ల కంటే ఎక్కువని తెలిసింది. ఇప్పుడు తాజాగా  ఈయన ఆస్తులు రూ. 55 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement