బాబు అవినీతి అనకొండ | Sakshi
Sakshi News home page

బాబు అవినీతి అనకొండ

Published Mon, Sep 11 2023 4:45 AM

Taneti Vanita comments over Chandrababu Naidu - Sakshi

కొవ్వూరు: చంద్రబాబు ఒక అవినీతి అనకొండ అని, ఆయన పాలనంతా అవినీతిమయమని.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో సూత్రధారిగా ఉండి రూ.371 కోట్లు స్వాహా చేశారని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత విమర్శించారు. ఆయన పాలనలో చోటుచేసుకున్న కుంభకోణాలు ఒక్కొక్కటిగా నిరూపణ అవుతుండడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. చంద్రబాబును అరెస్టుచేయడం ఏదో నేరమన్నట్లు రాద్ధాంతం చేసిన ప్యాకేజీ స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. ఆదివారం ఆమె ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే... 

చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ.. వాస్తవాలను దాచిపెట్టి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాన్ని పవన్‌ మానుకోవాలి. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి. లేకుంటే ప్రజలే ఛీదరించుకునే పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు అరెస్టును తప్పుపట్టిన పవన్‌ రోడ్డుపై పడుకుని ఓవర్‌యాక్షన్‌ చేశారు.

ఇక చంద్రబాబు ఒకరితో ఒప్పందం చేసుకుని మరో సంస్థకు నిధులు మళ్లించారు. 2014–19 మధ్య ఒక్క స్కిల్‌ స్కాంలోనే ఇంత దోపిడీకి పాల్పడగా, అమరావతి రాజధాని పేరు­తో రూ.వేల కోట్ల దోపిడీకి తెగబడ్డారు. కేవ­లం ఐదేళ్లలోనే ఇంత అవినీతికి పాల్పడిన చంద్ర­బాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన కాలంలో ఇంకెంత అవి­నీతికి పాల్పడి ఉంటారో అర్థంచేసుకోవచ్చు. చంద్రబాబు అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలి. 

వారంతా ఇప్పుడేం సమాధానం చెబుతారు? 
ఇక నోటీసు ఇవ్వకుండా అరెస్టుచేశారని ఒకసారి, గవర్నర్‌కు సమాచారం లేకుండా అరెస్టు చేశారని మరోసారి, ప్రభుత్వ కక్ష సాధింపులో భాగంగా అరెస్టు చేశారని ఇంకోసారి రకరకాల డ్రామాలాడిన టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులు ఇప్పుడేం సమాధానం చెబుతారు? దొంగే దొంగా దొంగా అన్నట్లుగా చంద్రబాబు ఇన్నాళ్లూ తన అవినీతి సామ్రాజ్యాన్ని నడిపారు. ఇప్పుడు ఆధారాలతో సహా దొరికిపోయేసరికి ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి కక్ష సాధింపు అంటూ ప్రజలను నమ్మించేందుకు లోకేశ్, ఆయన కుటుంబ సభ్యులు తాపత్రయపడుతు­న్నారు.

అవినీతికి పాల్పడిన నేరారోపణపై చంద్రబాబు జైలుకు వెళ్తుంటే దానిని కూడా రాజకీయ లబ్దికోసం వినియోగించుకోవడానికి టీడీపీ పాకులాడుతోంది. ఆధారాలతో అడ్డంగా దొరికిపోయి­నా దత్తపుత్రుడు మాత్రం తన ప్యాకేజీ సొమ్ము కోసం చంద్రబాబును సమర్థిస్తున్నాడు. ఎన్టీఆర్‌ను మానసిక క్షోభకు గురిచేసి, ఆయన ఆత్మక్షోభకు కారకుడైన చంద్రబాబు ఇన్నాళ్లకు ఫలితం అనుభవిస్తున్నాడు. ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నీచ పదజాలంతో దూషించిన టీడీపీ నాయకులు ఇప్పుడు చంద్రబాబు అవినీతిపై ఏ సమాధానం చెబుతారు?.

Advertisement

తప్పక చదవండి

Advertisement