తెలంగాణకు కిషన్‌రెడ్డి.. ఏపీకి పురంధేశ్వరి | Sakshi
Sakshi News home page

బీజేపీ స్ట్రాటజీ.. తెలుగు రాష్ట్రాల బీజేపీ చీఫ్‌ల మార్పు

Published Tue, Jul 4 2023 3:20 PM

Telangana BJP New Chief Kishan Reddy AP BJP New Chief Purandeswari  - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఎన్నికల వ్యూహంలో భాగంగా.. భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాల పార్టీ చీఫ్‌లను మార్చేస్తూ మంగళవారం కీలక నిర్ణయం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. తెలంగాణకు కొత్తగా జి. కిషన్‌రెడ్డిని, అలాగే ఆంధ్రప్రదేశ్‌కు దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ కొత్త చీఫ్‌గా నియమిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. 

తెలంగాణ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమించింది. అలాగే..  బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని సైతం తీసుకుంది. 

కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్‌, షెకావత్‌తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమావేశం అయిన అనంతరం.. పలు రాష్ట్ర అధ్యక్షులను ఖరారు చేశారు. అలాగే.. పంజాబ్‌ బీజేపీ అధ్యక్షుడిగా సునీల్‌ జక్కడ్‌ పేరును ప్రకటించారు. కిందటి ఏడాది మేలో ఈయన కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి జంప్‌ కొట్టారు. పంజాబ్‌లో జాతీయవాదం, ఐక్యత, సోదరభావం పెంపొందించేందుకే తాను పార్టీ మారానంటూ ఆ టైంలో ప్రకటించుకున్నారాయన. 

 ఇక.. జార్ఖండ్‌ బీజేపీ చీఫ్‌గా బాబూలాల్‌ మారాండి పేర్లను ప్రకటించారు. జార్ఖండ్‌ తొలి ముఖ్యమంత్రి. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారాయన. 

కిషన్ రెడ్డి గురించి..

జి.కిషన్ రెడ్డి బీజేపీలో సీనియర్‌ నాయకుడు. 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. మూడు దశాబ్దాల కింద అమెరికాకు వెళ్లిన బీజేపీ టీంలో కిషన్ రెడ్డి ఒకరు. అదే బృందంలో నేటి ప్రధాని నరేంద్ర మోదీ ఉండడం విశేషం.


(ఆనాటి అమెరికా పర్యటనలో కిషన్ రెడ్డి, నరేంద్ర మోదీ)

కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

  • 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే
  • 2009లో అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  ఎమ్మెల్యే
  • 2010న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక
  • 2012 జనవరి 19న మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 22 రోజులపాటు తెలంగాణలో పోరుయాత్ర
  • 2019లో సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నిక
  • ప్రస్తుతం కేంద్రమంత్రిగా సాంస్క్రతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు 
  • హోంశాఖ సహాయ మంత్రిగా చేయడం వల్ల ప్రధాని నరేంద్రమోదీకి, హోంమంత్రి అమిత్ షాలతో కలిసి దగ్గరగా పని చేసే అవకాశం 


పురంధేశ్వరి గురించి..రాజకీయ ప్రస్థానం

  • దగ్గుబాటి పురంధేశ్వరి.. చెన్నైలో ఏప్రిల్‌ 22, 1959లో జన్మించారు. 
  • స్వర్గీయ నందమూరి తారకరామారావు కుమార్తె. భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఇద్దరు పిల్లలు.
  • 14, 15వ లోక్‌సభకు రెండుసార్లు కాంగ్రెస్‌ తరపున ఎంపీగా ఎన్నికై.. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
  • 2004లో కాంగ్రెస్‌ తరపున బాపట్ల ఎంపీగా నెగ్గిన ఆమె.. ఆ సమయంలో కేంద్ర సహాయ శాఖ మంత్రిగా పని చేశారు.  
  • 2009లోనూ విశాఖపట్నం నుంచి రెండోసారి ఎంపీగా నెగ్గి మరోసారి కేంద్ర సహాయశాఖ మంత్రిగా పని చేశారు. 
  • గృహ హింస బిల్లు, హిందూ వారసత్వ సవరణ బిల్లు, మహిళలకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు లాంటి పలు బిల్లులపై అర్థవంతమైన చర్చల్లో పాల్గొన్నారు. పార్లమెంటులో ఆమె పనితీరును మెచ్చుకుంటూ, ఏషియన్ ఏజ్ ఆమెను 2004-05కి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపిక చేసింది.
  • 2014లో బీజేపీలో చేరి.. రాజంపేట నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు.
  • ఆమె వాగ్ధాటి, ఉచ్చారణ, ఉద్రేకపూరిత ప్రసంగాలకుగానూ ‘‘దక్షిణాది సుష్మా స్వరాజ్’’ బిరుదును తెచ్చిపెట్టాయి. 
  • ప్రస్తుతం బీజేపీ జనరల్‌ సెక్రటరీ హోదాలో ఉన్నారామె. 

Advertisement

తప్పక చదవండి

Advertisement