Telangana High Voltage Politics In Delhi - Sakshi
Sakshi News home page

ఢిల్లీలో హీటెక్కిన తెలంగాణ పాలిటిక్స్‌.. హస్తినాలో ఏం జరుగుతోంది?

Published Sat, Jun 24 2023 6:50 PM

Telangana High Voltage Politics In Delhi - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఒక వైపు కేంద్ర మంత్రులతో కేటీఆర్‌ వరుస భేటీలు.. మరో వైపు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలతో హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం.. దీంతో ఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్‌ హీటెక్కాయి. పార్టీ హై కమాండ్‌ నుంచి పిలుపు మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ రాజకీయాలు, తాజా పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, మరో వైపు హోం మంత్రి అమిత్‌షాతో కేటీఆర్‌ భేటీ కానున్నారు. ఇప్పటికే రాజ్‌నాథ్‌, హర్దీప్‌సింగ్‌, పీయూష్‌ గోయల్‌ను కేటీఆర్‌ కలిశారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ దగ్గరవుతున్నాయంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో కేటీఆర్‌కు కేంద్ర మంత్రులు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరు అని పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌ విషయానికొస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావులు ఏఐసీసీ నేతలను కలిసేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 26న ఉదయం 11 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, ఇతర కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో కలిసి ఆయన ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో భేటీ కానున్నట్లు తెలిసింది. ఈనెల 25న కలవాలని అనుకున్నా రాహుల్‌ అపాయింట్‌మెంట్‌ 26న లభించడంతో ఆ రోజున ఢిల్లీ వెళుతున్నట్టు పొంగులేటి శిబిరం చెబుతోంది.
చదవండి: కమలం పార్టీ శ్రేణుల్లో గుబులు.. నిధుల వాడకం వ్యాఖ్యలతో మైనస్‌ కానుందా?

పొంగులేటి, జూపల్లిలు తమ ముఖ్య అనుచరులతో కలిసి ఆ రోజున రాహుల్‌గాంధీని కలిసినప్పుడే వారు పార్టీలో ఎప్పుడు చేరాలన్న దానిపై ఓ స్పష్టత రానుంది. వచ్చే నెల మొదటి వారంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ముగిసే అవకాశమున్నందున అదే నెల 2న లేదా మరో రోజున ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

అదే సభలో పొంగులేటి అండ్‌ టీం కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఆయన ఖమ్మంలో తన అనుచరులతో కలిసి సభ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. ఇక, ఖమ్మంలో జరిగే సభలో మాజీమంత్రి జూపల్లి కూడా కాంగ్రెస్‌లో చేరతారా లేక మహబూబ్‌నగర్‌లో సభ నిర్వహిస్తారా అన్నది కూడా రాహుల్‌గాంధీని కలిసిన రోజునే స్పష్టత వస్తుందని తెలుస్తోంది.
చదవండి: ఆ నియోజకవర్గాల్లో మళ్లీ అదే సీన్‌ రీపిట్‌ అవుతుందా?

Advertisement

తప్పక చదవండి

Advertisement