List Of Candidates To Compete In Musheerabad Constituency, Know Its Political History In Telugu - Sakshi
Sakshi News home page

Musheerabad Political History: ముషీరాబాద్‌ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్య‌ర్థులు వీళ్లే..

Published Thu, Aug 3 2023 3:26 PM

These Are The Candidates To Compete In Musheerabad Constituency - Sakshi

ముషీరాబాద్‌ నియోజకవర్గం

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్దిగా పోటీచేసిన ముఠా గోపాల్‌ ఎన్నికయ్యారు. ఆయన తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ది అనిల్‌కుమార్‌పై 36888 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన సిటింగ్‌ ఎమ్మెల్యే, 2019 వరకు బిజెపి తెలంగాణ అద్యక్షుడుగా ఉన్న  డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ సుమారు 30800 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తొలిసారి ఎన్నికైన ముఠా గోపాల్‌ గంగపుత్రుల సమాజికవర్గానికి చెందినవారు. గోపాల్‌కు 72919 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ ఐ మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ కుమారుడైన అనిల్‌కుమార్‌కు 36031 ఓట్లు వచ్చాయి.

డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ముషీరాబాద్‌ నుంచి రెండోసార్లు గెలిచారు. 1999లో టిడిపితో కూటమి ఉన్నప్పుడు గెలవగా మళ్లీ 2014లో అదే కూటమి పక్షాన విజయం సాధించారు. 2014లో టిఆర్‌ఎస్‌ సమీప ప్రత్యర్ధి ముఠా గోపాల్‌పై 27386 ఓట్ల ఆధిక్యతతో లక్ష్మణ్‌ గెలిచారు. 2018లో గోపాల్‌ పైనే ఓడిపోయారు. గతంలో ముషీరాబాద్‌లో మాజీ ముఖ్యమంత్రి టి. అంజయ్య మూడుసార్లు గెలుపొందగా, మూడు దశాబ్ధాల తరువాత ఆయన భార్య మణెమ్మ రెండుసార్లు గెలుపొందడం విశేషం. అంజయ్య మరణించిన తరువాత లోక్‌సభ ఎన్నికలలో ఆమె పోటీచేసి గెలుపొందారు.

ఆ తరువాత కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలలో పెద్దగా లేరనే చెప్పాలి. అయితే 2008లో టిఆర్‌ఎస్‌ తెలంగాణ వ్యూహంలో భాగంగా 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు, ముషీరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయని నరసింహారెడ్డి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. దరిమిలా జరిగిన ఉప ఎన్నికలో పోటీచేయించడం కోసం ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అభ్యర్దుల అన్వేషణ చేసి చివరికి మణెమ్మను ఎంపిక చేసారు. ఆ ఉపఎన్నికలో గెలుపొందిన మణెమ్మ 2009 సాధారణ ఎన్నికలోనూ గెలిచారు. ఈ విధంగా భార్యాభర్తలిద్దరూ ఎమ్మెల్యేలుగాను, ఎమ్‌.పిలు గాను పనిచేసిన అరుదైన రికార్డును అంజయ్య, మణెమ్మలు సొంతం చేసుకున్నారు.

అంజయ్య వివిధ మంత్రివర్గాలలోను, 1981లో ముఖ్య మంత్రిగాను పనిచేసారు. ముఖ్యమంత్రి అయ్యాక మెదక్‌ జిల్లా రామాయంపేట నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఒకసారి 1957లో ఆర్మూరులో గెలిచారు. మొత్తం ఐదుసార్లు గెలిచారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఈయన ఒకసారి ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి పదవి కూడా నిర్వహించారు. టిఆర్‌ఎస్‌ నేతగా ఉన్న నాయని నరసింహారెడ్డి 1978లో జనతా పార్టీ పక్షాన పోటీచేసి అంజయ్యను ఓడిరచి సంచలనం సృష్టించారు. నాయిని 1978, 1985లలో జనతా పార్టీ తరుఫున గెలిచారు. తిరిగి 2004లో టిఆర్‌ఎస్‌లో చేరి విజయం సాధించారు.

నాయని 2004లో ఎన్నికైన తరువాత కొంతకాలం రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రం లో కెసిఆర్‌ క్యాబినెట్‌లో హోం మంత్రి అయ్యారు. తదుపరి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1983లో ఇక్కడ గెలిచిన నేత శ్రీపతి రాజేశ్వర్‌ 1985, 1999లలో సనత్‌నగర్‌ నుంచి గెలుపొందారు. ఎన్‌.టి.ఆర్‌. క్యాబినెట్‌లలో మంత్రిగా కూడా పనిచేసారు. కాంగ్రెస్‌ నాయకుడు ఎమ్‌.కోదండరెడ్డి రెండుసార్లు విజయం సాధించారు. 1957లో గెలుపొందిన సీతయ్య గుప్త, 1962లో బేగంబజార్‌ నుంచి గెలిచారు.

1952లో ఇక్కడ విజయం సాధించిన జి.ఎస్‌. మేల్కొటే మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ముషీరాబాద్‌లో  కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ ఐ కలిసి తొమ్మిదిసార్లు, జనతాపార్టీ రెండుసార్లు,టిఆర్‌ఎస్‌ రెండుసార్లు, బిజెపి రెండుసార్లు, టిడిపి ఒక్కోసారి గెలుపొందాయి. ఈ నియోజకవర్గంలో పదిసార్లు రెడ్డి నేతలు గెలిస్తే నాలుగుసార్లు బిసి నేతలు(మున్నూరుకాపు) గెలిచారు. ఒకసారి బ్రాహ్మణ, మరోసారి వైశ్య నేత గెలుపొందారు.

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Advertisement

తప్పక చదవండి

Advertisement