నవంబర్ 2 లోగా సంక్షేమ పథకాల చెల్లింపులు విడుదల చేయాలి: రేవంత్‌రెడ్డి | TPCC President Revanth Reddy Comments On BRS - Sakshi
Sakshi News home page

నవంబర్ 2 లోగా సంక్షేమ పథకాల చెల్లింపులు విడుదల చేయాలి: రేవంత్‌రెడ్డి

Published Thu, Oct 26 2023 11:42 AM

Tpcc Chief Revanth Reddy Comments On Brs - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నోటిఫికేషన్‌ విడుదలకు ముందే నగదు బదిలీ కార్యక్రమాలు పూర్తిచేయాలని ఈసీని కోరామని టీపీసీసీ ఛీప్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. 

‘‘బీఆర్‌ఎస్‌కు అనుకూలమైన రిటైర్డ్‌ అధికారులను తొలగించాలని కోరాం. బీఆర్‌ఎస్‌కు అనుకూలమైన అధికారులు ఏళ్లుగా కీలకమైన రంగాల్లో ఉన్నారు. కీలకమైన రంగాల్లో ఉన్న అధికారులు.. బీఆర్‌ఎస్‌కు ఆర్థిక సాయం చేయాలని వ్యాపార రంగాల వారిని కోరుతున్నారు. డీజీపీ అంజనీకుమార్‌ని తొలగించాలని ఈసీని కోరామని రేవంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తాయి. బీఆర్‌ఎస్‌,బీజేపీ,ఎంఐఎం.. చడ్డీ గ్యాంగ్‌. బీఆర్‌ఎస్‌ను కాపాడేందుకు కేంద్రం పనిచేస్తుందని రేవంత్‌ ధ్వజమెత్తారు.

బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా అధికారులు: ఉత్తమ్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకలాపాలకు ప్రభుత్వ భవనాలు వాడుతున్నారని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. తొమ్మిదిన్నరేళ్లుగా కొంతమంది అధికారులు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. సీఎం అధికార నివాసాన్ని పార్టీ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది: భట్టి
బీఆర్‌ఎస్‌ ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తుందో ఈసీకి తెలిపామని భట్టి విక్రమార్క అన్నారు. మేం చెప్పింది ఒకటైతే బీఆర్‌ఎస్‌ గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

‘‘మళ్లీ కేసీఆర్ మాయలో పడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. నాణ్యతాలోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయి. కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది. క్రిమినల్ కేసులు పెట్టి విచారిస్తే తప్ప అసలు విషయం బయటకు రాదు. డ్యామ్ సేఫ్టీ అధికారులు నివేదికను నివేదికను బయటపెట్టడం లేదు. కేంద్రానికి.. బీఆర్ఎస్ కు ఉన్న లాలూచీ ఏంటి?. కేంద్రానికి ప్రొటెక్షన్ మనీ చెల్లించారు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలపై చర్యలు తీసుకోవడంలేదు. మేడిగడ్డ కాదు.. కేసీఆర్ ప్రభుత్వం కుంగిపోయే పరిస్థితి వచ్చింది’’ అంటూ టీ.కాంగ్రెస్‌ నేతలు నిప్పులు చెరిగారు.

Advertisement
Advertisement