బీజేపీ కార్యకర్తలపై లాఠీలు, టియర్ గ్యాస్.. ఒకరి మృతి.. పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత
Published
Thu, Jul 13 2023 2:11 PM
పాట్నా: నితీశ్ సర్కారకు వ్యతిరేకంగా.. బీజేపీ చేపట్టిన ఆందోళన బీహార్ రాజధానిలో ఉద్రిక్తతకు దారి తీసింది. అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. అయినా పరిస్థితి అదుపు కాకపోవడంతో.. టియర్ గ్యాస్, వాటర్ కెనన్లకూ పని చెప్పారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త మృతి చెందినట్లు తెలుస్తోంది.
టీచర్ రిక్రూట్మెంట్ స్కాం ఆరోపణలతో పాటుగా పలు అంశాలపై నితీశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు గురువారం గాంధీ మైదాన్ వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ క్రమంలో అసెంబ్లీ ముట్టడికి బయల్దేరగా పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. ఇరువర్గాల నడుమ వాగ్వాదం చోటు చేసుకోగా.. పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. ఆందోళనకారులు తమతో దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులు.. పోలీసులు లాఠీఛార్జికి దిగారు. టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు వాటర్ కెనన్లు ఉపయోగించి వాళ్లను చెదరగొట్టారు. అయితే లాఠీఛార్జిలో గాయపడిన ఓ కార్యకర్త మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో.. పాట్నాలో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది.
నితీశ్ ప్రభుత్వంపై బీజేపీ అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతోంది. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాంలో జులై 3వ తేదీన సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయగా.. అందులో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పేరును సైతం చేర్చింది. దీంతో తేజస్వి రాజీనామా డిమాండ్ చేస్తూ.. ఆందోళన ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.