అప్పు తీరుస్తామని పిలిపించి.. రాధను చంపేశారు | Sakshi
Sakshi News home page

అప్పు తీరుస్తామని పిలిపించి.. రాధను చంపేశారు

Published Fri, May 19 2023 7:54 AM

- - Sakshi

ప్రకాశం: మండలంలోని జిళ్లెళ్లపాడు గ్రామానికి చెందిన కోటా రాధ (35) హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం...జిళ్లెళ్లపాడు గ్రామానికి చెందిన కోటా రాధకు, నల్గొండ జిల్లా కోదాడకు చెందిన మోహన్‌రెడ్డితో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. భర్త మోహన్‌రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. వీరు హైదరాబాద్‌లో కాపురం ఉంటున్నారు. ఈ నెల 11వ తేదీన హైదరాబాద్‌ నుంచి జిళ్లెళ్లపాడు గ్రామానికి వచ్చారు.

భర్త మోహన్‌రెడ్డి తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. రాధ కుమారుడిని తీసుకొని కనిగిరి వెళ్లి వస్తానని తండ్రి సుధాకర్‌రెడ్డితో చెప్పి వెళ్లింది. కనిగిరిలో ఉంటున్న బాబాయి వద్ద కుమారుడిని వదిలిపెట్టి బజారులో పని ఉంది చూసుకొని వస్తానని చెప్పి వెళ్లింది. రాత్రి 10 గంటలకు కూడా రాధ ఇంటికి రాకపోవడంతో సుధాకర్‌రెడ్డి, అతని తమ్ముడు కనిగిరిలో వెతికారు. అయినా కనిపించకపోవడంతో కనిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కనిగిరి పోలీసులు ఫోన్‌ లోకేషన్‌ జిళ్లెళ్లపాడు వద్ద చూపిస్తుందని వెలిగండ్ల పోలీసులకు తెలిపారు.

వెలిగండ్ల పోలీసులు జిళ్లెళ్లపాడు అడ్డరోడ్డు వద్దకు వెళ్లి చూడగా తారురోడ్డు పక్కన ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని, మృతదేహాన్ని డీఎస్పీ రామరాజు, సీఐ శ్రీనివాసరావులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్‌ కుమార్‌ తెలిపారు.

రాధ హత్యపై పలు అనుమానాలు
కోటా రాధ్య హత్యపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాధకు గన్నవరం పంచాయతీ గండ్లోపల్లికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గండ్లోపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఇటీవల ఐపీ పెట్టినట్లు సమాచారం. హత్యకు ఓ కారును ఉపయోగించినట్లు సమాచారం? ఈ హత్యకు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఈ హత్యలో ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా? ఇవన్నీ పోలీసుల దర్యాప్తులో తెలియాల్సింది.

Advertisement
Advertisement