ఒంగోలు, సాక్షిప్రతినిధి: నదీ పరీవాహక ప్రాంతాల్లోనే నాగరికత అభివృద్ధి చెందింది అనేది అందరికీ తెలిసిందే. ఆదిమానవులు నదుల పక్కనే ఉన్న కొండ దిగువ ప్రాంతాల్లో నివాసముంటూ జీవనం సాగించారన్నది చరిత్రకారులు చెబుతూ వస్తున్నారు. అందుకే పరిశోధకులు ఎక్కువగా నదీ పరీవాహక ప్రాంతాలనే ఎంచుకుంటుంటారు. ఈ క్రమంలో జిల్లాలో గుండ్లకమ్మ, పాలేరు, మాకేరు, మన్నేరు వాగులను ఆర్కియాలజీ విభాగానికి చెందిన విద్యార్థులు ఎంచుకున్నారు. దాదాపు ఏడు దశాబ్దాలుగా దేశంలో వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఆర్కియాలజీ అధికారుల సాయంతో పరిశోధనలు చేస్తున్నారు. మాకేరు, మన్నేరు, పాలేరు..వాటికి అనుబంధ వాగులు కనిగిరి ప్రాంతంలోనే ఎక్కువగా ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నప్పటి నుంచి పరిశోధనలు చేశారు. ఆదిమానవుని ఆనవాళ్లతో పాటు ఆవులు, గుర్రాలు, ఉడుములు, జింకల అవశేషాలు, రాతి పనిముట్లు గుర్తించారు.
– 1950లో ఎన్ ఐజాక్ అనే శాస్త్రవేత్త గుండ్లకమ్మ, పాలేరు నది పరివాహక ప్రాంతాల్లో పరిశోధన చేశారు. అప్పట్లో కర్నూలు జిల్లాలో అంతర్భాగంగా కనిగిరి, కంభం తదితర గ్రామాలు ఉండేవి. ఆయా గ్రామాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో ఆయన పరిశోధన చేశారు. ఆయన సమర్పించిన పీహెచ్డీ రికార్డులో ఈ ప్రాంతంలో ఆదిమానవులు నివశించారని ప్రస్తావించారు. అలాగే 1975లో వి.మధుసూదన్ రావు అనే శాస్త్రవేత్త ఆంధ్ర యూనివర్శిటీలో పీహెచ్డీ చేశారు. ఈయన పెదఅలవలపాడు, వెలిగండ్ల మండలాల్లోని పాలేరు, మన్నేరు పరివాహక ప్రాంతాల్లో పర్యటించి పరిశోధన పత్రాలను సమర్పించారు. అంతేకాకుండా 2004–05 సంవత్సరాల్లో హైదరాబాద్కు చెందిన జియాలజిస్ట్లు గుండ్లకమ్మ, మన్నేరు ప్రాంతాల్లో పర్యటించారు. ఇండోనేషియాలో బద్దలైన అగ్ని పర్వతాల ఆనవాళ్లకు సంబంధించి, వాటి నుంచి వచ్చే బూడిదను ఈ ప్రాంతాల్లో ఆయన కనిపెట్టారు. ఇది గాలి ద్వారా వచ్చింది. దీని వల్ల జంతు జాతులు అంతరించడం, మానవుల సంఖ్య తగ్గినట్లు నివేదికలున్నాయి. దానికి సంబంధించిన ఆనవాళ్లు (రాతియుగం నాటి పనిముట్లు, జంతు జాలాలు, అవశేషాలు కన్పించాయి) కూడా ఇక్కడే ఉన్నాయి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని కందుకూరు సమీపం మాచవరం గ్రామానికి చెందిన దేవర అనిల్ కుమార్ గుజరాత్లోని ఆర్కియాలజీ మహారాజా సాయాజీరావు యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన తన సీనియర్ సమర్పించిన పరిశోధనలకు సంబంధించిన రికార్డులు అధ్యయనం చేశారు. అలాగే జిల్లాకు చెందిన ప్రొఫెసర్ కొండా శ్రీనివాసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన సలహాలు, సూచనలతో పలుమార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) హైదరాబాద్ వారి ద్వారా జీపీఆర్ సర్వే నిర్వహింపజేసి వారు సూచించిన ప్రాంతంలో మధ్య ప్రాచీన యుగం నాటి, రాతి యుగం నాటి ఆదిమానవుని, జంతు జలాలపై లోతైన పరిశోధన ప్రారంభించిన అనీల్ కుమార్ పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. 2017–18 సంవత్సరాల నుంచి గుండ్లకమ్మ, పాలేరు, మన్నేరు పరివాహక ప్రాంతాలైన సీఎస్పురం, డీజీపేట, పెద అలవలపాడు, హనుమంతునిపాడు, సింగరాయకొండ, నెల్లూరు జిల్లాలోని జడదేపి తదితర ప్రాంతాల్లో పరిశోధన చేశారు. కనిగిరిలోని మన్నేరు వాగులో ఎక్కువ శాతం మధ్యప్రాచీన రాతియుగం (70 వేల ఏళ్లు) కాలం నాటి అవశేషాలు, సర్ఫేస్ సర్వేలో (బయటకు కనిపించేవి) నాలుగు కిలోమీటర్ల మేర ఉన్నాయి. నీటి కోత ఎక్కువ జరగడం వల్లే అధిక సంఖ్యలో అవశేషాలు ఉన్నందున మన్నేరు వాగును ఎంచుకున్నట్లు ఆయన చెబుతున్నారు. హనుమంతునిపాడు వద్ద పాలేరులో 2.50 లక్షల ఏళ్ల నాటి రాతి పనిముట్లు లభించాయి. 2019 మన్నేరు వాగులో పరిశోధన చేసి కొన్ని అవశేషాలను గుర్తించారు. 2020లో ఒకటిన్నర నెల తవ్వకాలు జరపగా అక్కడ చాలా ప్రాచీన కాలం నాటి, ఆసక్తికర అవశేషాలు దొరకడంతో పూర్తి స్థాయిలో సైంటిఫిక్గా లోతుగా పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పామూరు మండలం మోట్రాలపాడు మన్నేరు వాగులో హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐ (నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు) చెందిన వారితో జీపీఆర్ (జియోగ్రౌండ్ ఫెనిటిరేటింగ్ రాడార్) కింద రాళ్లు, గుంతలు ఉన్నాయా అనేది తెలుసుకునేందుకు సర్వే చేశారు. డాక్టర్ సక్రమ్, డాక్టర్ ఆనంద్ పాండేల ఆధ్వర్యంలో 12 మంది ఎంఏ విద్యార్థులు ఈ నెల 13, 14, 15 తేదీల్లో సర్వే చేశారు. ఎక్కడెక్కడ అవశేషాలు ఉన్నాయనే దానిపై క్షుణ్ణంగా సర్వే చేసేందుకు వాళ్లు సూచనలు ఇచ్చారు. వాళ్లు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాల్లో జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.