చీమకుర్తి: గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్ల మరమ్మతులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం రూ.9 కోట్లను అందించేందుకు పరిపాలన ఉత్తర్వులు ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్ల మరమ్మతులకు నిధులను విడుదల చేయాలని చేసిన విజ్ఞప్తి చేశారు. వెంటనే సీఎం స్పందించారని నిధుల విడుదలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చినట్లు ఎమ్మెల్యే టీజేఆర్ తెలిపారు. గుండ్లకమ్మ ఎగువ నుంచి వచ్చిన వరద నీటి ప్రవాహానికి ఇటీవల ప్రాజెక్ట్లోని 3వ గేటు కిందనున్న గడ్డర్ కొట్టుకుపోవడంతో ప్రాజెక్ట్లోని నీళ్లు సముద్రం పాలయ్యాయి. దానిపై చంద్రబాబునాయుడు ఇటీవల గుండ్లకమ్మ ప్రాజెక్టను సందర్శించి లేనిపోని ఆరోపణలు చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. టీడీపీ పాలనా కాలంలో గేట్లు మరమ్మతులకు మంజూరు చేసిన రూ.3 కోట్లను సుందరీకరణ పేరుతో నొక్కేసిన కారణంగానే గేట్లకి తుప్పుపట్టి ఇటీవల వరదలకు మూడో గేటు కొట్టుకుపోయిందనే విషయాన్ని టీడీపీ నాయకులు పక్కన పెట్టి వైఎస్సార్సీపీపై అసత్య ఆరోపణలు చేశారని ఆయన విమర్శించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎలాంటి విఘాతం లేకుండా ప్రాజెక్ట్ గేట్లకి మరమ్మతులు చేపడతామన్నారు. పనులు సత్వరం చేపడతామని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు చెప్పారు.
మంజూరు ఉత్తర్వులిచ్చిన సీఎం వైఎస్ జగన్ సీఎంను కలిసి వివరించిన బాలినేని, టీజేఆర్