ఒంగోలు సెంట్రల్: మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి సింహపురి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ నుంచి ఒంగోలు వస్తారని బాలినేని కార్యాలయ ప్రతినిధి తెలిపారు. తర్వాత షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.
వెంకటేష్ను పరామర్శించిన మాగుంట
ఒంగోలు టౌన్: ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం హైదరాబాద్లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న చీరాల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కరణం వెంకటేష్ను ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి పరామర్శించారు. ఆదివారం కరణం నివాసానికి వెవెళ్లిన మాగుంట ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
నేటికి పాదయాత్ర పూర్తయి ఆరేళ్లు
● నేడు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వేడుకలు
ఒంగోలు సెంట్రల్: జననేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పూర్తి చేసి ఆరు సంవత్సరాలు అయిన సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నగర అధ్యక్షుడు కటారి శంకర్రావు తెలిపారు. కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించి నాటి పాదయాత్ర, నేటి జగనన్న సుపరిపాలన గురించి గుర్తు చేస్తూ కేక్ కటింగ్ చేస్తారని చెప్పారు. పార్టీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.
బండారు రామారావుకు ఘన నివాళులు
ఒంగోలు మెట్రో: నట చూడామణి బిరుదాంకితుడు బండారు రామారావు అని పలువురు వక్తలు కొనియాడారు. బండారు రామారావు 47వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలు నెల్లూరు బస్టాండ్ సెంటర్ ఆయన విగ్రహం వద్ద బండారు రమా నాట్యమండలి అధ్యక్షుడు అల్లూరు శాంతారావు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో విగ్రహ కమిటీ కార్యదర్శి ప్రకాశం మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఉన్నంత వరకు బండారు రామారావును గుర్తుంచుకుంటారని అన్నారు. సీనియర్ కళాకారులు ఐఓబీ బ్యాంకు మేనేజర్ కనకమాల రాయపాలు మాట్లాడుతూ పద్యం ఉన్నంతకాలం సత్య హరిశ్చంద్ర నాటకం బతికే ఉంటుందన్నారు. బండారు రామారావు విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.
నవ భారత నిర్మాణం కోసం కలిసి అడుగేద్దాం ●
● కెనరా బ్యాంకు వాకథాన్లో డిప్యూటీ జనరల్ మేనేజర్ మంజునాథ్
ఒంగోలు టౌన్: నవ భారత నిర్మాణం కోసం భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా కలిసి నడుద్దామని కెనరా బ్యాంకు సర్కిల్ ఆఫీస్ డిప్యూటీ మేనేజర్ మంజునాథ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఒంగోలు మంగమూరు కెనరా బ్యాంకు బ్రాంచి నుంచి భాగ్యనగర్ వరకు వాకథాన్ నిర్వహించారు. వాకథాన్లో పెద్ద సంఖ్యలో కెనరా బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. విజిలెన్స్ వారోత్సవాలను పురస్కరించుకొని ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో వాకథాన్ నిర్వహించినట్లు తెలిపారు. దేశ ప్రగతికి అడ్డంకిగా మారిన అవినీతికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని, అవినీతిని పూర్తిగా నిర్మూలించాలన్న ఉద్దేశంతోనే విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజాపరిపాలనలో సమగ్రత, పారదర్శకత, జవాబుదారితనాన్ని పెంపొందించడానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వివిధ కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ఎన్ మారుతి శశిధర్ తదితరులు పాల్గొన్నారు.