అభివృద్ధి..సంక్షేమానికి ప్రాధాన్యత | Sakshi
Sakshi News home page

అభివృద్ధి..సంక్షేమానికి ప్రాధాన్యత

Published Thu, Nov 9 2023 1:12 AM

సదస్సుకు హాజరైన వివిధ వర్గాల ప్రజలు - Sakshi

కనిగిరి రూరల్‌: అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత కల్పిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని రాజ్యసభ సభ్యుడు, దక్షిణకోస్తా జిల్లాల రీజినల్‌ కోఆర్డినేటర్‌ విజయసాయిరెడ్డి తెలిపారు. నాలుగున్నరేళ్ల వైఎస్సార్‌ సీపీ పాలనలో కనిగిరి రూపురేఖలు మారిపోయాయన్నారు. సామాజిక సాధికార బస్సుయాత్రలో భాగంగా బుధవారం సమాజంలో వివిధ వర్గాలను ప్రభావితం చేయగల వ్యక్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమం తప్ప అభివృద్ధి జరగడంలేదని దుష్ప్రచారం చేస్తున్న విపక్షాల నోర్లు మూయించాలని, సీఎం జగన్‌ చేసిన మంచిని ప్రజలకు వివరించాలని కోరారు. కనిగిరి మున్సిపాలిటీలో జల్‌జీవన్‌ మిషన్‌ కింద రు.125 కోట్లతో ఇంటింటికీ మంచినీటి కుళాయి ఏర్పాటు చేశారని, రూ.122 కోట్లతో ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా రహదారులు నిర్మించారని, జాతీయ రహదారి 4 లో రూ.230 కోట్లతో మాలకొండ–సీతారాంపురం రహదారి నిర్మించారన్నారు. అలాగే రూ.1250 కోట్లతో వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటుకానుందని, ప్రస్తుతం టెండర్‌ దశలో ఉందన్నారు. నిరుపేదల ఇంటి కల నెరవేర్చే క్రమంలో నియోజకవర్గంలో 18 వేల నివేశనస్థల పట్టాలు అందించినట్లు తెలిపారు. మరోవైపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు విద్య, వైద్యం, ఆర్థిక సాధికారత, సామాజిక భద్రత, ఉపాధి కల్పన కోసం 2,54,213 మంది లబ్ధిపొందేలా రూ.1382 కోట్లు ఖర్చు చేశారన్నారు. బలహీన వర్గాల సంక్షేమానికి జగన్‌ ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందన్నారు. నియోజకవర్గంలో బీసీల సంక్షేమం కోసం రూ.551 కోట్లు, ఎస్సీలకు రూ.291 కోట్లు, ఎస్టీలకు రూ.28 కోట్లు ఖర్చు చేశారన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలకు రాజకీయ పదవుల్లో సైతం అగ్రతాంబూలం ఇచ్చారని గుర్తుచేశారు. ముగ్గురు జెడ్పీటీసీలు, ముగ్గురు ఎంపీపీలు, 8 మంది వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్మన్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, 121 మంది సర్పంచ్‌లు, ఎంపీటీసీ పదవులు ఇచ్చినట్లు తెలిపారు.

అలాగే కనిగిరిని ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కనిగిరిలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడంతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీటీ వర్గాలకు చేసిన మంచిని తెలియజేయాలని కోరారు. మరమ్మతులకు గురైన రోడ్లు త్వరలోనే పూర్వవైభవం సంతరించుకోనున్నాయన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్‌, మేరుగు నాగార్జున, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌, పలువురు ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అభివృద్ధితో మారిన కనిగిరి రూపురేఖలు అణగారిన వర్గాల అభివృద్ధికి రూ.1382 కోట్లు రూ.1250 కోట్లతో వాటర్‌గ్రిడ్‌ రూ.125 కోట్లతో ఇంటింటికీ కొళాయి విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి

Advertisement
Advertisement