పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత | Sakshi
Sakshi News home page

పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత

Published Fri, Nov 17 2023 1:40 AM

- - Sakshi

మార్కెట్‌ యార్డు కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌

త్రిపురాంతకం: వైఎస్సార్‌ సీపీలో పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం ఇచ్చి సామాజిక న్యాయం పాటిస్తూ పదవుల ద్వారా వారికి తగిన ప్రాధాన్యత ఇస్తారని, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. త్రిపురాంతకంలో యర్రగొండపాలెం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సింగారెడ్డి నాగమణి పోలిరెడ్డి, సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలో కష్టపడేవారికి ప్రాధాన్యత ఇస్తారని, పార్టీ కోసం పనిచేస్తున్న సింగారెడ్డి నాగమణి పోలిరెడ్డిని మార్కెట్‌యార్డు చైర్మన్‌గా నియమించామని అన్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇప్పటి వరకు మార్కెట్‌ యార్డు ద్వారా మూడు పర్యాయాలు వైఎస్సార్‌ సీపీకి చెందిన వారే సేవలందించారని అన్నారు. రైతులకు అవసరమైన సేవలను మార్కెట్‌ యార్డు ద్వారా అందించేందుకు నూతన పాలక మండలి ద్వారా కృషి చేస్తామని తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వలే ఆలోచించలేదన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి రాజకీయంగా ఎదిగేందుకు సామాజిక న్యాయం పాటించారని అన్నారు. యర్రగొండపాలెంలో రైతు బజార్‌ నిర్మించుకున్నామని, త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. అదే విధంగా మార్కెట్‌ యార్డు కార్యాలయం, గోడౌన్‌ నిర్మాణ పనులు, ఓపెన్‌ ప్లాట్‌ ఫాం నిర్మాణాలు చేపడతారని వివరించారు. రైతులు, కౌలు రైతులు, గిరిజన రైతులు, దేవాలయ భూముల రైతులంతా పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మార్కెట్‌ యార్డు దోహదం చేస్తుందని అన్నారు. రైతుల పక్షపాతిగా పనిచేస్తున్న జగనన్న ప్రభుత్వానికి అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసుకోవడం ద్వారా జిల్లాలో వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అదే విధంగా మాచర్ల వద్ద శంకుస్థాపన చేసిన వరికపుడిశల ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గ ప్రజలకు నీటి కష్టాలు తీరనున్నాయన్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు ప్రజలను విస్మరించాయన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాటల ముఖ్యమంత్రి కాదని, చేతల్లో ఆచరించి చూపించారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, గ్రామసర్పంచ్‌ పొన్న వెంకటలక్ష్మి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ ఆర్‌ సుశీల వెంకట పిచ్చయ్య, జెడ్పీటీసీ మాకం జాన్‌పాల్‌, మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలు రిబకమ్మ, మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మూర్తిరెడ్డి, గ్రామసచివాలయ కన్వీనర్‌ సీహెచ్‌ యల్లారెడ్డి, సొసైటీ అధ్యక్షుడు దగ్గుల గోపాల్‌రెడ్డి, మైనార్టీ సెల్‌ జిల్లా నాయకుడు మజీద్‌ నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మండల పార్టీ కన్వీనర్లు, సచివాలయాల కన్వీనర్లు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. సభకు ముందు పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, పార్టీ దివంగత నాయకుడు పెద్దపోతు చంద్రమౌళిరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. యర్రగొండపాలెం మార్కెట్‌ యార్డు కమిటీ చైర్మన్‌గా సింగారెడ్డి నాగమణి పోలిరెడ్డిచే మార్కెట్‌యార్డు సెక్రటరీ కపిల్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. వైస్‌చైర్మన్‌గా కొర్రపోలు జయరావు, డైకెక్టర్‌లుగా హసావత్‌ హనిమిభాయి, కె మరియమ్మ, కుమారి, సుశ్మిత, గంగమ్మ, కాశమ్మ, అంబమ్మ, నారాయణమ్మ, గంగరాజు, రమణారెడ్డి, అల్లు రామ్‌భూపాల్‌రెడ్డి, దోగిపర్తి సంతోష్‌కుమార్‌, డి చిన్నమౌలాలిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మలను ఘనంగా గజమాలలతో సన్మానించారు.

సభలో ప్రసంగిస్తున్న  మంత్రి 
డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌
1/1

సభలో ప్రసంగిస్తున్న మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌

Advertisement
Advertisement