● ప్రభుత్వ పురస్కారానికి ఎంపికై న కందేపి రాణీప్రసాద్ ● బాలసాహిత్యంలో సేవలకు అధికారిక గుర్తింపు ● నేడు హైదరాబాద్లో అవార్డు ప్రదానం
సిరిసిల్లకల్చరల్: సృజనాత్మక హస్త కళాకారిణి, బాలసాహితీవేత్త, కాలమిస్టుగా గుర్తింపు పొందిన డాక్టర్ కందేపి రాణీప్రసాద్కు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విభిన్న రంగాల్లో అందిస్తున్న సేవలను గుర్తించి 27 మంది మహిళలను ప్రత్యేక పురస్కారాలకు ఎంపిక చేసింది. ఇందులో భాగంగా సాహిత్య విభాగంలో రాణీప్రసాద్ను ఎంపిక చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భారతీ హోళీకేరి ఉత్తర్వులు జారీ చేశారు. అవార్డు కింద రూ.లక్ష నగదును ప్రభుత్వం అందజేయనుంది.
రాణీప్రసాద్ సేవలివీ...
బాలసాహితీవేత్తగా సుమారు 50కి పైగా పుస్తకాలు వెలువరించారు. పాతికేళ్లుగా సాహితీ సేద్యం చేస్తూ అనేక ప్రక్రియల్లో కవితాశక్తిని చాటుకున్నారు. కథలు, కవితలు, కల్పికలు, వ్యాసాలు, పజిల్స్, సైన్స్ వ్యాసాంగం వంటి ప్రక్రియల్లో రాణించారు. 1999లో ‘పూలతోట’తో ప్రారంభమైన రచనా వ్యాసాంగం సరదా సరదా బొమ్మలు, హరివిల్లు, నెలవ ంక, సైన్స్పాయింట్, బాలతేజం, నంది వర్ధనాలు, బా ల్యమా ఎక్కడ నీ చిరునా మా, విహారం, కస్తూరిబా జీవిత చరిత్ర, మిఠాయి పొ ట్లం, సైన్స్ వరల్డ్, సీతాకోకచిలుక, హౌస్ వైఫ్, సైన్స్కార్నర్, పూలజడ, స్వీటిమిల్కీ ఓ చిలుక, ద్రాక్షగుత్తులు, కనుచూపు మేర, సౌరభం, పజిల్స్ పాయింట్, బొటానికల్ జూ, సృజన, క్వారంటైన్, డాక్టర్ చెప్పిన కథలు, నా జ్ఞాపకాల్లో అమ్మ తదితర పుస్తకాలను వెలువరించారు. మరో 9 పుస్తకాలను అనువదించారు. వ్యర్థమైన పదార్థాలతో అర్థవంతమైన ఆకృతులను తీర్చిదిద్దడంలోనూ రాణీప్రసాద్ సృజనాత్మకతను ప్రదర్శించారు. సిరిసిల్లలోని ప్రఖ్యాత పిల్లల వైద్యులు ప్రసాద్రావు సతీమణి, ఆసుపత్రి వ్యవహారాలు పర్యవేక్షిస్తూనే తన మనోభీష్టమైన సృజనాత్మకత, సాహితీ సేవ చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినో త్సవం సందర్భంగా ప్రభుత్వ పురస్కారానికి ఎంపికవడంపై జిల్లా సాహితీవేత్తలు, వైద్యులు అభినందనలు తెలిపారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఎలగొండ రవి, ఆడెపు లక్ష్మణ్, అంకారపు రవి, బూర దేవానందం అభినందించారు.