● కన్నతల్లికి కడుపుకోత ● తంగళ్లపల్లిలో విషాదం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కళ్ల ముందే కిడ్నీ వ్యాధితో కొడుకు తళ్లడిల్లుతుంటే కన్నపేగు తట్టుకోలేకపోయింది. కొడుకు ప్రాణాలను కాపాడాలని మంత్రి కేటీఆర్ను వేడుకోగా కిడ్నీ ఆపరేషన్కు సాయం చేయగా తల్లి కిడ్నీని అందించింది. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. కళ్లముందు కలకాలం జీవిస్తాడనుకున్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో రోదనలు మిన్నంటాయి. తంగళ్లపల్లికి చెందిన లింగం లత–శ్రీనివాస్ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు లింగం తరుణ్(13). తరుణ్ మూడు నెలల పసిగుడ్డుగా ఉన్నప్పటి నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడేవాడు. కొడుకును కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రులు 13 ఏళ్లుగా సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చు చేశారు. ఐదో స్టేజీలో కిడ్నీ వ్యాది ఉండగా తల్లి లత తన కిడ్నీని ఇచ్చింది. కేటీఆర్ చొరవతో ప్రైవేట్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. కానీ తరుణ్ ఆరోగ్యం కుదుటపడలేదు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణంచి శుక్రవారం రాత్రి కన్నుమూశాడు. కుటుంబ పోషణకు తండ్రి శ్రీనివాస్ గల్ఫ్బాట పట్టడంతో బాలుడి మృతదేహాన్ని శవపేటికలో భద్రపరిచి తండ్రి చివరి చూపు కోసం ఎదురుచూస్తున్నారు. తండ్రి శ్రీనివాస్ గల్ఫ్ నుంచి బయలుదేరగా ఆదివారం తంగళ్లపల్లికి చేరుకోనున్నారు.