సారంగాపూర్: మండల కేంద్రానికి చెందిన కస్తూరి రాయమల్లు (75) క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. రాయమల్లు భార్య గంగమ్మ నాలుగు నెలల క్రితం మృతిచెందింది. అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్నాడు. పైగా ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెడుతుండడంతో శుక్రవారం రాత్రి ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108లో జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు నగేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గొల్లపల్లి: మండలంలోని శ్రీరాములపల్లికి చెందిన చిల్ముల చిన్న గంగారాం (54) చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న గంగారాం ఈనెల 7న తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా శ్రీరాములపల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు, శరీరంలోని ఇతరచోట్ల బలమైన గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం జగిత్యాలలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.