కారుచౌక జర్నీ | Sakshi
Sakshi News home page

కారుచౌక జర్నీ

Published Sun, Feb 4 2024 12:26 AM

- - Sakshi

తక్కువ చార్జీకే ప్రయాణం

రాజధాని, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు యాప్‌లో సీటు బుకింగ్‌

ఉద్యోగుల ప్రాధాన్యం దీనికే..

నచ్చిన చోట పికప్‌,

డ్రాప్‌ సదుపాయం

ఇంధనం, డబ్బు ఆదా

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న

‘కార్‌ పూలింగ్‌’ కల్చర్‌

నగరానికి చెందిన అఖిల్‌ అత్యవసరంగా హైదరాబాద్‌ వెళ్లాల్సి ఉంది. బస్సుల్లో రద్దీ చాలా ఉంది. రిజర్వేషన్‌లోనూ సీట్లు లేవు. వెంటనే తన వద్ద ఉన్న ఓ కార్‌పూలింగ్‌ యాప్‌ ఓపెన్‌ చేసి, సీటు బుక్‌ చేసుకుని రాజధానికి

వెళ్లిపోయాడు అఖిల్‌.

బదిలీల అనంతరం ప్రభుత్వ ఉద్యోగులు సైతం నలుగురు లేదా ఐదుగురు ఎంప్లాయీస్‌ కలిసి కార్‌ పూలింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకే ఆఫీసులో పనిచేయడం, కారు అయితే స్టాపుల్లేకుండా నేరుగా ఆఫీసుకే వెళ్లే వీలుండటంతో కార్‌ పూలింగ్‌కు మొగ్గు చూపుతున్నారు.

అద్దెకారు జర్నీ ఖరీదైంది. ఇద్దరు.. నలుగురు కలిసి కరీంనగర్‌ నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ వెళ్లాలంటే రూ.5వేలకు తక్కువ ఖర్చవడం లేదు. పెరిగిన ఇంధన ధరలు, ఖర్చుల నేపథ్యంలో అంతకన్నా తక్కువ తీసుకుంటే తమకు గిట్టుబాటు కాదని కారు నిర్వాహకులు చెప్పేస్తున్నారు. బస్సుల్లో రద్దీ, సమయం వృథా, సిటీలో ట్రాఫిక్‌ జామ్‌ నేపథ్యంలో సరే అని కారులో వెళ్లిపోతున్నారు. అయితే అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ కారు ప్రయాణాన్ని చౌకకే అందిస్తోంది. కార్‌ పూలింగ్‌కు కొన్నియాప్‌లు అందుబాటులో ఉండగా ఉమ్మడి జిల్లా నుంచి చాలామంది సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్లేవారు.. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవారు కార్‌ పూలింగ్‌ ద్వారా ప్రయాణం చేస్తున్నారు. తక్కువ ధరకే షేరింగ్‌ జర్నీ చేస్తూ సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. కారు నిర్వాహకులకు సైతం ఇం‘ధన’ం ఆదా అవుతోంది. అసలేంటీ ‘కారు’చౌక జర్నీ అనుకుంటున్నారా..? చదవండీ సండే స్పెషల్‌..!!

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

ఉమ్మడి జిల్లాలో కార్‌ పూలింగ్‌ కల్చర్‌ పెరిగిపోతోంది. పెరిగిన రద్దీతో ఉద్యోగులు, విద్యార్థులు ఈ విధమైన ప్రయాణానికి పెద్దపీట వేస్తున్నారు. జిల్లా కేంద్రాలైన కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల నుంచి ప్రతీరోజు రాజధానితో పాటు వరంగల్‌, మంచిర్యాల, గోదావరిఖని, నిజామాబాద్‌ ఇలా ఏ ప్రాంతానికై నా కార్‌ పూలింగ్‌కే జై కొడుతున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌, వరంగల్‌ తరువాత ఆ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న నగరం కరీంనగర్‌. ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాదిమంది హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరు, ముంబై, చైన్నె తదితర ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్‌, బ్యాంకింగ్‌, కార్పొరేట్‌ తదితర మల్టీనేషనల్‌ కంపెనీల్లో కొలువు చేస్తున్నారు. వీరంతా వారాంతానికి ఉమ్మడి జిల్లాకు రావడం, తిరిగి సోమవారం ఉదయానికి వారి ఉ ద్యోగస్థానాలకు వెళ్లడం రివాజుగా మారింది. దీనికితోడు ప్రతిరోజూ కోర్టు కేసులు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు, రకరకాల అవసరాల రీత్యా రాజధానికి వెళ్లేవారి సంఖ్య లెక్కేలేదు.

ఓనర్‌, రైడర్‌కు మేలు

ఈ యాప్‌లు కార్లు లేని వారికే కాదు సొంత వాహనాలు ఉన్న వారికీ సౌకర్యంగా ఉంటుంది. చాలా మంది ఉమ్మడి జిల్లాకు వివిధ పనులు, పండుగలు, సెలవులకు వచ్చి, కుటుంబ సభ్యులను దింపి తిరిగి ఒంటరిగా వెళ్తుంటారు. అంటే దాదాపు గంటల కొద్దీ ప్రయాణం ఒంటరిగా చేయాలి. అదే సమయంలో కరీంనగర్‌ నుంచి పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్‌ జిల్లాలకు వెళ్లే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తమ కొలీగ్స్‌ రానప్పుడు ఈ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఎవరికై నా పెట్రోల్‌ ఖర్చు ఆదానే కదా. అందుకే, బ్లాబ్లా కార్‌, క్విక్‌రైడ్‌ యాప్‌లో రైడ్‌ వివరాలు పోస్టు చేస్తున్నారు. క్షణాల్లో కారు ఖాళీ సీట్లు నిండిపోతున్నాయి. కారు ఓనరూ ఆర్టీసీచార్జీలే తీసుకుంటుండటంతో జర్నీలో టైంపాస్‌, పెట్రోల్‌ చార్జీలు కలిసి వస్తున్నాయి.

నచ్చిన చోట పికప్‌.. డ్రాప్‌

ఈ యాప్‌తో మరో సదుపాయం ఏంటంటే.. హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్లినప్పుడు ముందు రైల్వేస్టేషన్‌/బస్టాండ్‌లో దిగుతాం. అక్కడి నుంచి మనం అనుకున్న స్థానాలకు వెళ్లాలంటే క్యాబ్‌లకు రూ.200, 300 పెట్టాలి. ట్రాఫిక్‌తో గంటలపాటు ఇరుక్కుపోతుంటారు. కానీ, ఈ యాప్‌ ద్వారా ఓనరు ప్రయాణించే మార్గంలో మనకు నచ్చిన చోట దిగవచ్చు. ఉదా: నిమ్స్‌ వెళ్లాలనుకుంటే మెహదీపట్నం వెళ్లే కారును ఎంచుకోవచ్చు. హైటెక్‌ సిటీ వెళ్లాలనుకుంటే కొండాపూర్‌ వెళ్లే కారును సెలెక్ట్‌ చేసుకుని, అక్కడే దిగిపోవచ్చు. చాలా కార్లు ఓఆర్‌ఆర్‌ మీదుగా వెళ్తుండటంతో సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి.

సమయానికి చేరుకోవచ్చు

హైదరాబాద్‌ లాంటి ప్రాంతాలకు కార్‌ పూలింగ్‌ యాప్‌ ద్వారా బుకింగ్‌ చేసుకుని ప్రయాణించడం ద్వారా సమయం, డబ్బులు ఆదా అవుతున్నాయి. ఎలాంటి ఆలస్యం లేకుండా గమ్యానికి అనుకున్న సమయంలోనే చేరుకునే వెసులుబాటు ఉంది. వివిధ వ్యాపారాల రీత్యా దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కార్‌ పూలింగ్‌ యాప్‌ను ఎక్కవగా వినియోగించుకుంటున్నారు.

– శనిగరపు రవీందర్‌, ప్రభుత్వ ఉద్యోగి

ఉమ్మడి జిల్లాలో కార్ల సంఖ్య ఇలా

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కార్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. బ్యాంకుల సులభ వాయిదా రుణాలు, మార్కెట్‌లోకి కొత్త కార్లు వస్తుండటం, కరోనా తరువాత భౌతిక దూరానికి ప్రాధాన్యం పెరగడంతో సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్‌ కూడా ఊపందుకుంది. ఇందుకు ఉమ్మడి జిల్లాలో రిజిష్టర్‌ అయిన కార్ల వివరాలే నిదర్శనం.

కరీంనగర్‌: 47,023

సిరిసిల్ల: 11,911

జగిత్యాల: 12,824

పెద్దపల్లి: 10,400

టోల్‌గేట్‌ల వద్ద తాకిడి

పాత జిల్లాలో రెండు ప్రధాన టోల్‌గేట్లు ఉన్నాయి. ఇందులో ఒకటి కరీంనగర్‌ జిల్లా రేణికుంట వద్ద కాగా, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌ వద్ద రెండోది ఉంది. ఈ టోల్‌గేట్ల మీదుగా ప్రతిరోజూ రాకపోకలు సాగించే కార్ల వివరాలు ఇలా ఉన్నాయి.

టోల్‌గేట్‌ హైదరాబాద్‌ వైపు హైదరాబాద్‌ నుంచి

రేణిగుంట 5,500 సుమారు 5,000 సుమారు

బసంత్‌నగర్‌ 1,500 సుమారు 1,100 సుమారు

1/3

2/3

3/3

Advertisement
Advertisement