శరణ్యా ఎక్కడమ్మా..? అంటూ తల్లి వేదన.. 'పొదల్లో పడేశా.. చెరువులో వేశానంటూ భర్త సమాధానం..! | Sakshi
Sakshi News home page

శరణ్యా ఎక్కడమ్మా..? అంటూ తల్లి వేదన.. 'పొదల్లో పడేశా.. చెరువులో వేశానంటూ భర్త సమాధానం..!

Published Thu, Oct 19 2023 4:50 AM

- - Sakshi

రంగారెడ్డి: మానవత్వం మంటగలుస్తోంది.. తాగుడు బానిసైన తండ్రిని ఏడాదిన్నర పాప వద్ద ఉంచి పనికి వెళ్తే పాపనే కనపడకుండా చేశాడు ఆ కసాయి. దీంతో ఆతల్లి బిడ్డ ఆచూకీ కోసం తల్లిడిల్లుతోంది. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మున్సిపల్‌ పరిధిలోని చటాన్‌పల్లికి చెందిన పద్మ, బోవయ్య దంపతులకు ఒక బాబు, పాప సంతానం.

భర్త తాగుడుకు బానిసవ్వడంతో పద్మ హోటల్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ప్రతిరోజు సాయంత్రం 4గంటలకు పనికి వెళ్లి రాత్రి ఒంటి గంటకు వస్తుంది. ఆమె ఎప్పటిలాగే మంగళవారం పిల్లల వద్ద తండ్రిని ఉంచి పనికి వెళ్లింది. రాత్రి 11గంటలకు హోటల్‌ వద్దకు వెళ్లిన బోవయ్య పిల్లలు ఏడుస్తున్నారని పద్మను ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి వచ్చిచూస్తే కూతురు శరణ్య(18నెలలు) కనిపించలేదు.

దీంతో పాప ఎక్కడని భర్తను నిలదీసింది. బైపాస్‌ సమీపంలోని చెట్ల పొదల్లో పడవేశా.. చెరువులో వేశా.. అంటూ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పద్మ పోలీసులను ఆశ్రయించింది. భర్తపైనే అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు బైపాస్‌ సమీపంలోని చెట్ల పొదలు, చెరువులో గాలించినా పాప ఆచూకీ లభించలేదు. తాగుడుకు బానిసైన తండ్రి పాప ఎవరికై నా విక్రయించాడా..? హత్యచేసి మరెక్కడైనా పడవేశాడా, భార్యా భర్తలమధ్య కలహాలున్నాయా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ రాంరెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement