సామాజిక మాధ్యమాల్లో
మంచాల: ఒక్కప్పుడు యోగ క్షేమాలు తెలుసుకునేందుకు మొబైల్ ఫోన్ నేడు ప్రతీ పనికి ప్రధానాధారమైంది. ప్రస్తుతం చరవాణి లేకుంటే చేయి విరిగినంత పని అవుతోంది. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు సెల్ నిత్యకృత్యమైంది. పెరిగిన సాంకేతికతతో కూర్చున్న చోటు నుంచే ప్రపంచాన్ని చుట్టేయొచ్చు. ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్న మొబైల్ ఫోన్ అంతే స్థాయిలో వినాశనాలకు ఉపయోగిస్తున్నారు. సెల్ ఫోన్ ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగించే వారిపై సైబర్ నేరాల నివారణ చట్టాలను సైతం తీసుకువచ్చింది.
ప్రధాన ప్రచారాస్త్రంగా మారిన సెల్ఫోన్
ప్రస్తుత అసెంభ్లీ ఎన్నికల నేపథ్యంలో మొబైల్ ఫోన్ ఓ ప్రధాన ప్రచార వేదికగా మారింది. ఎక్కడ ఏమి జరిగిన క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్తుంది. ప్రత్యర్థులు సైతం సోషల్ మీడియా ద్వారా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ ఎన్నికల ప్రచారాలతో పాటు ప్రత్యర్థులు మీద విమర్శలు గుప్పిస్తున్నారు. టీవీ చానళ్లు, దిన పత్రికలతో పాటు సోషల్ మీడియాకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
క్షణాల్లోనే వైరల్
రాజకీయ నాయకులు సోషల్ మీడియాపై దృష్టి సారించారు. ఓ ఓటర్లను ఆకట్టునేందుకు ప్రజల్లో ఉంటూనే ప్రత్యర్థుల ఆటకట్టించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తాము చేసిన పనులు ప్రజల్లోకి తీసుకొని పోవడంతో పాటుగా తమను విమర్శించే వారికి ఇదే వేదికగా సమాధానం చెబుతున్నారు. ఇందుకు ప్రత్యేకంగా సోషల్ మీడియా కార్యకర్తలను నియమించుకుంటూ వార్కు సమాయత్తం చేస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతో పాటు ప్రత్యర్థుల పరపతి తగ్గించే పనులకు శ్రీకారం చుట్టుతున్నారు. ఇలా.. సోషల్మీడియాలో ప్రత్యర్థుల ఎన్నికల వార్ జోరుగా సాగుతోంది. గతంలో సభలు, సమావేశాలకు పరిమితమైన ఆరోపణలు, విమర్శలు చేసేవారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నా లైవ్ పెట్టి మరీ తిప్పికొడుతున్నారు. సభలు, సమావేశాల వీడియోలు, ఫొటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
ఫోన్లు, ఇంటర్నెట్ల వాడకం పెరిగిన నేపథ్యంలో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్ వేదికగా రాజకీయ
నాయకులు ప్రచారం చేస్తున్నారు.
ఇందుకు ప్రత్యేక సైన్యం సైతం
పనిచేస్తోంది. అభ్యర్థులు, ప్రత్యర్థులు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.
ప్రచారంలో దూసుకుపోతున్న రాజకీయ పార్టీలు
అభ్యర్థుల తరుఫున పనిచేస్తున్న ప్రత్యేక సైన్యం
వాస్తవమా..? అవాస్తవమా..?
ఫోన్ ఆన్ చేస్తే చాలు వందల కొద్దీ ఎన్నికల ప్రచారాలకు సంబంధించిన ఫొటోలు, వార్తలు, ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేక వార్తలను సృష్టించి మరీ పెడుతున్నారు. ఏది వాస్తవం.. అవాస్తవం గుర్తించడం కష్టతరంగా మారింది. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియా వేదికగా కఠోర వాస్తవాలు వెలుగులోకి వచ్చినా.. మరికొన్ని సందర్భాల్లో అవాస్తవాలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనా ‘సోషల్ వార్’ రాజకీయాలను వేడెక్కిస్తుంది.