ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో పట్టణం గులాబీమయమైంది. కార్యకర్తలు, అభిమానులు, జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేసీఆర్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. పార్టీ కేడర్లో జోష్ నింపింది. ప్రభుత్వం పథకాలు సక్రమంగా అమలు కావాలంటే మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ రావాలని.. ఇబ్రహీంపట్నంలో మంచి జరగాలంటే మంచిరెడ్డి కిషన్రెడ్డిని గెలిపించాలని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేయొద్దని, కారు గుర్తుకు ఓటేస్తే అందరూ సుఖసంతోషాలతో ఉంటారని పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయం
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చొరవతో రూ.2,931 కోట్లతో ఇబ్రహీంపట్నంను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తామన్నారు. రూ.15 కోట్లతో ఇబ్రహీంపట్నం పెద్ద వాగు బాగుచేయడం ద్వారా నేడు ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నిండిందన్నారు. 84వేల ఎకరాలకు సాగునీరందించే ఉద్దేశంతో శివన్నగూడ ప్రాజెక్టు సిద్ధమైందని ఇప్పటికే డీపీఆర్ పూర్తి చేశారని తెలిపారు. సాగునీరందించాలని ముఖ్యమంత్రిని కోరారు. సాగర్ రహదారిని నాలుగులేన్ల రోడ్డు చేయాలని విన్నవించారు. శంషాబాద్ నుంచిపెద్దంబర్పేట్ మీదుగా బొంగ్లూర్ వరకుమెట్రో రైలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యుడు కేశవరెడ్డి, మంత్రి సబితారెడ్డి, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్పర్సర్ అనితారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య, మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.