తలకొండపల్లి: మండల పరిధిలోని జూలపల్లిలో భారీగా మద్యం పట్టుబడింది. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని జూలపల్లిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ జైపాల్రెడ్డి కోళ్ల ఫారంలో అక్రమంగా మద్యం నిల్వ చేశారు. సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీను సిబ్బందితో వెళ్లి తనిఖీ చేపట్టారు. 204 కాటన్లలో 9,792 బాటిళ్లలో 1,760 లీటర్ల మద్యం నిల్వ చేసినట్లు గుర్తించారు. మద్యాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మాజీ సర్పంచ్ జైపాల్రెడ్డితో పాటు, రాజు, లక్ష్మారెడ్డి, యాదయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ.19.38 లక్షలు ఉంటుందని అడిషనల్ డీసీపీ తెలిపారు. తలకొండపల్లి, ఆమనగల్లు, కడ్తాల్ మండలాల్లో సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని, ఆయా గ్రామాల్లో ప్రత్యేక దళాలను నియమించి, గట్టి నిఘా ఉంచనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
విఠాయిపల్లి సమీపంలో ..
ఆమనగల్లు: మండలంలోని విఠాయిపల్లి గ్రామ సమీపంలో తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నట్లు ఆమనగల్లు ఎస్ఐ బాల్రాం తెలిపారు. మంగళవారం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా బొలెరో వాహనంలో తీసుకెళ్తున్న 25 బాక్స్ల మద్యం బాటిళ్లను ఎస్ఓటీ, స్థానిక పోలీసులు పట్టుకున్నట్టు వివరించారు. పట్టుబడిన మద్యం విలువ రూ.2.30 లక్షలు ఉంటుందని చెప్పారు. ఈ మేరకు కందుకూ రు మండలం దెబ్బడగూడకు చెందిన సలీంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.