మహేశ్వరం: క్షణికావేశంలో కన్న కొడుకును ఓ కసాయి తండ్రి కొట్టి చంపాడు. ఈ ఘటన మండల పరిధిలోని అమీర్పేట్లో బుధవారం రాత్రి జరిగింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. కర్నూల్ జిల్లా సిబెలగల్ మండలం రంగాపురం గ్రామానికి చెందిన సంధ్యపోగు శివ, లతలకు గత ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. వీరు ఉపాధి కోసం కర్నూల్ నుంచి వచ్చి మహేశ్వరం మండలంలోని అమీర్పేట్లో ఉంటున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు.. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెలు ఉన్నారు. శివ మద్యం, చెడు వ్యసనాలకు బానిసై నిత్యం భార్య లతతో గొడవ పడేవాడు. బుధవారం రాత్రి లత కూరగాయలు తీసుకురావాడానికి పెద్ద కుమారుడు, కుమార్తెను తీసుకొని వెళ్లగా, చిన్న కుమారుడు సంజు(3)ను ఇంటి వద్ద తండ్రి దగ్గర విడిచి వెళ్లింది. సంజు గట్టిగా ఎడవడంతో తండ్రి శివ కోపంతో పొట్ట, తలపై బలంగా కొట్టడంతో అపస్మారక స్ధితిలోకి వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత తల్లి, చుట్టూ పక్కల వారు గమనించి చూడగా అప్పటికే సంజు మరణించాడు. తల్లి లత లబోదిబోమని విలపించడంతో గమనించిన స్థానికులు ఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు శివను అరెస్టు చేశారు. తన కొడుకును చంపిన భర్త శివను కఠిన శిక్షించాలని భార్య లత, బంధువులు డిమాండ్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి రిమాండ్కు తరలించామని సీఐ ముని తెలిపారు.
నిందితుడికి రిమాండ్