ఇబ్రహీంపట్నం రూరల్: గంజాయి విక్రయించే ఓ వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ కృష్ణయ్య వివరాల ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగుళూరు ఔటర్ సర్వీస్ రోడ్డులో శ్రీశ్రీ ఏరోసిటీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న అశుతోష్ చౌబే వద్ద గంజాయి ఉందని ముందుస్తు సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. అతని దగ్గర నుంచి 200 గ్రాముల గంజాయిని స్వాధీ నం చేసుకున్నారు. అతడు ఉత్తర్ప్రదేశ్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
బైక్ అదుపు తప్పడంతో ఘటన
ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణ సమీపంలోని షాద్నగర్ రోడ్డులో ఆదివారం రాత్రి బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. దీనికి సంబంధించి ఆమనగల్లు ఎస్ఐ బాల్రాం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తలకొండపల్లి మండలం కర్కాస్తండాకు చెందిన కేతావత్ గోపాల్(43) మోటార్ బైక్పై ఆదివారం మధ్యా హ్నం ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లిలో బంధువుల ఎంగేజ్మెంట్కు వచ్చారు. అనంతరం రాత్రి స్వగ్రామానికి వెళుతుండగా పట్టణ సమీపంలో రైస్మిల్లు మూలమలుపు వద్ద అదుపుతప్పి కింద పడటంతో ఆయన అక్కడి కక్కడే మృతిచెందారు. దీనిపై మృతుని భార్యకేతావత్ చిట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాల్రాం తెలిపారు.
నోటీసులు జారీ
కుల్కచర్ల: అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కుల్కచర్ల పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో పర్మిషన్ లేని ఇళ్లు, షెడ్ల నిర్మాణాలు చేపట్టిన పలువురికి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలను పాటించి ఇళ్ల, షెడ్ల నిర్మాణాలకు అనుమతులు పొందాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కార్యకర్తల కృషి వెలకట్టలేనిది: ఎమ్మెల్యే
కుల్కచర్ల: కాంగ్రెస్ పార్టీ గెలుపులో కార్యకర్తల కృషి వెలకట్టలేనిదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం మండల నాయకులు రామ్మోహన్రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ సాధించడంలో కార్యకర్తల కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. కార్యకర్తలు ప్రజలందరికీ వారధిగా నిల్చుని ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివరించి పార్టీ అధికారంలోకి రావడానికి పని చేశారని చెప్పారు. కార్యకర్తలతో పాటుగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం పని చేస్తామని వివరించారు. కార్యక్రమంలో బ్లాక్ బి అధ్యక్షుడు కర్రె భరత్కుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్, నాయకులు కనకం మొగులయ్య, జోగు వెంకటయ్య, సోషల్ మీడియా ఇన్చార్జి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన ఉపాధి జేఏసీ జిల్లా అధ్యక్షుడు
అనంతగిరి: ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీతక్కను వికారాబాద్ జిల్లా ఉపాధి హామీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు బి.నవీన్కుమార్ మర్యాదపూర్వంగా హైదరాబాద్లోని ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మరింత ఉత్సాహంతో పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకువస్తామన్నారు.