కవాడిగూడ: బీసీ ‘ఎ’ కులాలలో ఉన్నవారి హక్కుల సాధనకు జస్టిస్ ఎ.రామలింగేశ్వర్రావు చేసిన కృషి మరువలేనిదని బీసీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు డాక్టర్ భాగయ్య, అధ్యక్షుడు నరహరి అన్నారు. హైకోర్టు న్యాయవాదిగా, హైకోర్టు జడ్జిగా జస్టిస్ రామలింగేశ్వర్రావు బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆదివారం కవాడిగూడ లోయర్ ట్యాంక్బండ్లోని బండమైసమ్మ నగర్లో ఉన్న తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జస్టిస్ రామలింగేశ్వర్ రావు హఠాణ్మరణం యావత్ బీసీ కులాలకు తీరనిలోటుగా అభివర్ణించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు గడప శ్రీహరి, న్యాయవాది బాలరాజ్, గూడబోయిన శివరత్నం, అంబటి మల్లయ్య, సుధాకర్, కంటె రాంచందర్, సత్యనారాయణ, గడప శంకర్ పాల్గొన్నారు.
బీసీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు