సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ షాక్ ఇచ్చింది. కూల్ జర్నీపై ఆంక్షలు విధించింది. పర్యాటకులను, నగరవాసులను విశేషంగా ఆకట్టుకున్న హాలిడే పాస్ను ఎత్తేసింది. రూ.59కే లభించే హాలిడే పాస్తో ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడికై నా ప్రయాణం చేసే అవకాశం ఉండేది. రెండో శనివారం, ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉండేది. దీంతో ఆ రోజుల్లో లక్షలాది మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మార్చి 31 నుంచి హాలిడే పాస్ పథకాన్ని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రోజువారీ ప్రయాణాలపై లభించే 10 శాతం రాయితీని కూడా నిలిపివేశారు. ఇప్పటి వరకు సుమారు 30 వేల మందికి పైగా విద్యార్థులు వినియోగించుకుంటున్న స్టూడెంట్ పాస్ల గడువు కూడా ఈ ఏప్రిల్ నెలాఖరుతో ముగియనుంది. ఈ పాస్ను తీసుకున్న విద్యార్థులు తాము ప్రయాణం చేసే మార్గంలో 20 ట్రిప్పులకు చార్జీలు చెల్లించి మరో 10 ట్రిప్పులు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ప్రస్తుతం ఈ పాస్లను వినియోగిస్తున్నవారు ఈ నెలాఖరు వరకు ప్రయాణం చేయొచ్చు. కొత్త ఆర్థిక సంవత్సరం ఆదాయ వ్యయాలను అంచనా వేసేందుకే పథకాలను నిలిపివేసినట్లు సమాచారం.
రాయితీలను ఎత్తేసిన హెచ్ఎంఆర్