Telangana Crime News: రైతు ప్రాణం తీసిన 'హెచ్‌ఎండీఏ' సర్వే..
Sakshi News home page

రైతు ప్రాణం తీసిన 'హెచ్‌ఎండీఏ' సర్వే..

Published Fri, Aug 18 2023 3:52 AM

- - Sakshi

మెదక్‌: హెచ్‌ఎండీఏ అధికారులు సర్వే చేసి హద్దులు పాతారనే సమాచారం తెలిసి భూమి ఎక్కడ పోతుందోనని ఆందోళనతో ఓ రైతు గుండె ఆగిపోయింది. ఈ సంఘటన పెద్దశంకరంపేటలో గురువారం తెల్లవారుజాము చోటుచేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన డాగ్గారి నారాయణ(75)కు పట్టణ శివారులో కొన్ని ఎకరాల భూమి ఉంది. ఇందులో అతడి తమ్ముడికి కూడా కలిపి 3 ఎకరాల అసైన్డ్‌ భూమి ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. బుధవారం హెచ్‌ఎండీఏ అధికారులు సర్వే చేసి హద్దులు పాతారనే సమాచారం తెలియడంతో భూమి ఎక్కడ పోతుందోనని ఆందోళనతో గుండెపోటుకు గురై మృతిచెందాడని తెలిపారు.

రైతుల ఆందోళన..
అధికారులు సర్వే సక్రమంగా చేపట్టకుండా తమ భూముల్లో హద్దులు పాతారాని సుమారు 70 మంది రైతులు తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై తహసీల్దార్‌ గ్రేస్‌బాయి, ఎస్‌ఐ బాలరాజు, ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, ఎంపీటీసీ వీణసుభాష్‌గౌడ్‌లు వారికి నచ్చజెప్పారు. రైతులు సాగు చేసుకుంటున్న అసైన్డ్‌, పట్టా భూముల విషయంపై ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు నివేదించి వారికి న్యాయం చేస్తామని తహసీల్దార్‌ రైతులకు హామీ ఇచ్చారు.

విషయానికొస్తే..
పట్టణ శివారులో గత ఏడాది హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ)కు 217 సర్వే నంబర్‌లో 257 ఎకరాల 18 గుంటల భూమిలో.. 85 ఎకరాల సాగుకు పనికిరాని భూమిని అభివృద్ధి కోసం రెవెన్యూ అధికారులు అప్పగించారు. ఈ విషయమై కొంతకాలంగా రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ భూమిని సర్వే చేపట్టేందుకు బుధవారం హెచ్‌ఎండీఏ అధికారులు జేసీబీలతో వచ్చి పలు చోట్ల హద్దులను గుర్తించి జెండాలను పాతారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement