ఉద్యోగం వస్తదో.. రాదోనని.. నానమ్మతో బాధపడి.. చివరికి ఇలా..
Published
Sun, Aug 20 2023 6:16 AM
సంగారెడ్డి:ఉద్యోగం రాదేమోనన్న బెంగతో యువకుడు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించి చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన శనివారం మండలంలోని చిలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన తీపిరిశెట్టి వినయ్(20) తండ్రి శ్రీనివాస్ ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లాడు.
తల్లి మానసిక స్థితి సరిగా లేక అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటుంది. వినయ్ నానమ్మతో కలిసి చిలాపూర్లో ఉంటూ డిగ్రీ పూర్తి చేసి ఆర్మీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. గత ప్రయత్నంలో ఉద్యోగానికి సెలక్ట్ కాకపోవడంతో కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చి ఈసారి కూడా ఉద్యోగం వస్తదో రాదోనని నానమ్మ కనుకమ్మతో చెప్పి బాధపడ్డాడు.
శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. గమనించిన బంధువులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం వినయ్ మృతి చెందాడు. మృతుని తల్లి మానసిక స్థితి సరిగా లేకపోవడం, తండ్రి శ్రీనివాస్ దుబాయ్లో ఉండటంతో బాబాయి రవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఎల్లయ్య తెలిపారు.