చిన్నశంకరంపేట(మెదక్): గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో మండలంలోని గవ్వలపల్లి గ్రామానికి చెందిన భూపాల కిష్టయ్య(45) మడూర్ గ్రామంలో ఉంటున్న బంధువుల ఇంటికి బైక్పై వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఎల్లమ్మ ఆలయం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో కిష్టయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నారాయణగౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్యాంకర్ ఢీకొని యువకుడు..
పటాన్చెరు టౌన్: ట్యాంకర్ లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన అమీన్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాలు. బొల్లారం వినాయకనగర్కు చెందిన ప్రవీణ్ కుమార్(29) స్థానిక పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా గండీగూడ కాలనీ వద్ద రెడీమిక్స్ ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ తల పూర్తిగా నుజ్జయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు.
చెరువులో పడి..
జగదేవ్పూర్(గజ్వేల్): ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రం జగదేవ్పూర్లో శనివారం జరిగింది. ఎస్ఐ చంద్రమోహన్, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రాగుల కిష్టయ్య(52) మేస్త్రి పనులు చేస్తుంటాడు. ఇతని బంధువు రాగుల సాయికుమార్ ఇటీవల మృతి చెందాడు అతని పెద్దకర్మ కార్యక్రమంలో భాగంగా శనివారం రెడ్డమైన చెరువు వద్ద స్నానానికి వెళ్లారు. బట్టల కోసం కట్టపైకి వస్తున్న క్రమంలో కిష్టయ్య ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ప్రభుత్వాసుపత్రికి తరలించారు.