ప్రముఖ ప్రవచనకర్త చాగంటి
సిద్దిపేటజోన్: ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారు చరిత్రలో నిలిచిపోతారని, అందుకు రామాయణ, మహాభారతాలే నిదర్శనమని ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం రాత్రి రెండో రోజు మానవీయ విలువలు అనే అంశంపై ప్రవచనాలు చేశారు. ప్రతి ఒక్కరూ రామాయణం, భాగవతం చదవాలని, ముఖ్యంగా చిన్న పిల్లలకు వాటి సారం తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రామాయణం చదివితే మర్యాద, సంస్కారం వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలని, అది ముక్తి మార్గమని అన్నారు. పరుల హితం కోరుకునే గుణం ఉండాలని సూచించారు. మహాత్ముల జీవితాలు పూలపాన్పులు కావని, కష్టంతో జీవితం మొదలు పెట్టినవారేనన్నారు. భగవంతుడి లీలలు అన్ని సమాజం కోసమేనని, వాటి సారాంశాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. మహాత్ముల త్యాగం వల్ల స్వాతంత్య్రం వచ్చిందన్నారు. గురువు జ్ఞానం ఆయన వారసులకు చెందదని, ఎవరైతే గురువు అడుగుజాడల్లో నడుస్తారో, గురువును ఉపాసన చేస్తారో వారికి జ్ఞానం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. గురువు సమాజ అభ్యుదయం కోసం ప్రయత్నాలు చేస్తారని, అందుకు చేరుకునే లక్ష్యం కోసం అవసరమైన దిశానిర్దేశం కూడా చేస్తాడని సూచించారు. ప్రేమ,కరుణ ఉన్నవారినే ఈశ్వరుడు ఆదరిస్తాడని, అసూయ, ద్వేషం విడనాడాలని పేర్కొన్నారు. చదువుకున్న విద్యకు సార్థకత లభించాలంటే నిజాయితీగా బతకాలన్నారు. తాను మాత్రమే ఎదగాలనే అసూయ మంచిదికాదన్నారు.