దివ్యాంగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి అడివయ్య
సంగారెడ్డి: దివ్యాంగుల స్వయం ఉపాధి శిక్షణ స్టడీ సర్కిల్ నిర్వహణకు ప్రభుత్వ భవనాన్ని కేటాయించాలని పలువురు దివ్యాంగులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్కు వినతి పత్రం అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందించి భవనం కేటాయింపులో తన సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి అడివయ్య, అధ్యక్షుడు మాణిక్, జిల్లా అధ్యక్షుడు గోపాల్, కార్యదర్శి బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కాలనీల్లో
కాంగ్రెస్ నేతల పర్యటన
పటాన్చెరు: అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీల్లో కాంగ్రెస్ నాయకుడు కాట శ్రీనివాస్ గౌడ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సుధారాణి పర్యటించారు. గురువారం వందనపురి కాలనీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందనపురి కాలనీ, భరత్నగర్ కాలనీ, మల్లారెడ్డి కాలనీ, నల్లూరి హైట్స్, ఎస్ఎల్ఎన్ హోమ్స్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కాలనీవాసులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకొని, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్, కౌన్సిలర్ లావణ్య, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
వస్తు నాణ్యతపై అవగాహన
సంగారెడ్డి అర్బన్: పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంటర్నల్ క్వాలిటీ ఇన్సూరెన్స్ సెల్ ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఎస్ఐ) సహకారంతో వస్తు నాణ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని ప్రిన్సిపాల్ రత్న ప్రసాద్ గురువారం తెలిపారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 14న ప్రపంచ నాణ్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విధులు, ప్రాముఖ్యత, నాణ్యతా ప్రమాణాలు ఆవశ్యకత గురించి సమావేశం నిర్వహించామన్నారు. కళాశాలకు చెందిన 120 మంది విద్యార్థులతో స్టాండర్డ్స్ క్లబ్ను ఏర్పాటు చేశామన్నారు. నాణ్యతా ప్రమాణాలు కలిగిన వస్తువుల వినియోగం ద్వారానే ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుత సమాజంలో 90 శాతం నాణ్యతలేని వస్తువులని తెలిసినా వాటిని వినియోగించటం ఆందోళనకరమని పరిణామమన్నారు. నాణ్యతా ప్రమాణాలు లేని ప్రపంచం తదితర అంశాలపై వ్యాసరచన, స్కిట్ పోస్టర్ పెయింట్ పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమానికి బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ దిలీప్, స్టాండర్డ్స్ ప్రమోషన్ అధికారి అభిసాయి, ప్రధాన రిసోర్స్ అధికారి ప్రభాకర్ హాజరయ్యారు.
రేపు శని అమావాస్య పూజలు
జహీరాబాద్ టౌన్: తెలంగాణ దేవదాయ ధర్మదాయ శాఖ పరిధిలోగల శ్రీ సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 14వ తేదీన అమావాస్య పూజలు నిర్వహిస్తున్నట్లు ఏఓ మోహన్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా దేవస్థానం ఆవరణలోగల శనీశ్వర స్వామికి తైలాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాదన వితరణ చేస్తామని తెలిపారు.