సంగారెడ్డి టౌన్: జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న 3,975 మంది పీఓ, ఏపీఓ, ఓిపీఓలు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ శుక్రవారం తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గం లో 873 మంది, అందోల్ నియోజకవర్గంలో 623 మంది, జహీరాబాద్ నియోజకవర్గంలో 788 మంది, సంగారెడ్డి నియోజకవర్గం లో 1263 మంది, పటాన్చెరులో 428 మంది పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకున్నారన్నారు.
సిబ్బందికి మరో అవకాశం
ఈనెల 21 నుంచి 23 వరకు ఓటుహక్కు వినియోగించుకోని ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి మరో అవకాశం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. సిబ్బంది ఈనెల 26వ తేదీన నేరుగా తమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఇతర జిల్లాలో ఓటు ఉండి ఈ జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది 27న సంగారెడ్డి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అదనపు ఓటరు సదుపాయ కేంద్రంలో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. 26న పోలీస్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు సంబంధిత నియోజకవర్గంలో, 27న పోలీస్, నాన్ గవర్నమెంట్ సిబ్బంది సంగారెడ్డి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో తమ ఓటు వేసుకోవచ్చని తెలిపారు.