హుస్నాబాద్: ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి మంజూరు చేసిన నిధులపై పాలకవర్గ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. గతంలో హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో అప్ప టి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హుస్నాబాద్ పట్టణాభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్న ట్లు ప్రకటించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు ఆగస్టులో జీఓ విడుదల చేసింది. ఇందులో దాదాపు 14 పనులకు సెప్టెంబర్లో వర్క్ అప్రూవల్ పూర్తి చేశారు. అనంతరం ఆన్లైన్లో టెండర్ ప్రక్రియకు ఆహ్వానించారు. కొన్ని కారణాల వల్ల మొదటిసారి టెండర్ ప్రక్రియను రద్దు చేయ గా, రెండోసారి ఎన్నికల కోడ్ నేపథ్యంలో టెండర్ ప్రక్రియను నిలిపివేశారు.
కొత్త ప్రభుత్వం ఇచ్చేనా..?
కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణాలు ఇతర అభివృద్ధి పనులు కొంత వరకు పూర్తి చేసినప్పటికీ పూర్తి స్థాయిలో కావాలంటే మరిన్ని నిధులు కావాల్సి ఉంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడింది. వచ్చే ఏడాది చివరిలో మున్సిపల్ ఎన్నికల జరుగుతుండడంతో ప్రస్తుతం పాలకవర్గ సభ్యులు రూ.25 కోట్ల కోసం కాచుకూర్చున్నారు. మరో వైపు కొత్తగా నిర్మిస్తున్న మున్సిపల్ భవనం నిర్మాణానికి కొన్ని నిధులు అవసరం కాగా, వచ్చే నిధుల నుంచే మున్సిపల్ భవనంకు రూ.1.25 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో భవనాన్ని పూర్తి చేసి ఈ హయాంలోనే మున్సిపల్ భవనాన్ని ప్రారంభించుకోవాలని ప్రస్తుత పాలకవర్గం భావిస్తోంది.
మంత్రి పొన్నంపైనే ఆశలన్నీ..
రూ.25 కోట్ల నిధుల విషయంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే, ప్రస్తుత రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ పైనే మున్సిపల్ పాలకవర్గం ఆశలు పెట్టుకుంది. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులను యథావిధిగా కొత్త ప్రభుత్వం మంజూరు చేస్తుందా లేదంటే కాలయాపన చేస్తుందా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
గత ప్రభుత్వం మున్సిపల్ అభివృద్ధికి
నిధులు మంజూరు
కాసుకూర్చున్న పాలకవర్గ సభ్యులు
చివరి అంకంలో వార్డులు అభివృద్ధి
చేసుకోవాలని ఆశ
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆగిన టెండర్ ప్రక్రియ
కొత్త ప్రభుత్వం ఇస్తుందా అనే సందేహాలు
నిధులు వస్తాయని ఆశిస్తున్నాం
గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఆపకుండా కొత్త ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఆశిస్తున్నాం. ఏ ప్రభుత్వం అయినా అభివృద్ధినే కోరుకుంటుంది. ఆన్లైన్లో టెండర్లు కూడా వేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో టెండర్ ప్రక్రియను నిలిపివేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరికి కృషి చేసి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.
– ఆకుల రజిత, మున్సిపల్ చైర్ పర్సన్, హుస్నాబాద్