ఝరాసంగం(జహీరాబాద్): జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రమైన బర్దిపూర్ శ్రీదత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో దత్త జయంతి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఆశ్రమ పీఠాధిపతులు 108 వైరాగ్య శిఖా మణి, అవధూత గిరిమహారాజ్, డాక్టర్ సిద్దేశ్వర స్వాముల ఆధ్వర్యంలో హోమం, యజ్ఞం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆశ్రమ ఆవరణలోని జ్యోతిర్లింగాలు, దత్తాత్రేయ మందిరం, సుబ్రహ్మణ్యస్వామి, నవగ్రహాల ఆలయాల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులు మొక్కు లు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, ఆశీర్వదించారు. ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
21 యజ్ఞ గుండాలతో హోమం
దత్త జయంతి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆశ్రమ ఆవరణలో ఇరవై ఒక్క యజ్ఞ గుండాలతో దత్త హోమం, చండీ హోమం నిర్వహించారు. 108 మంది రుత్వికులు, దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాతశ్రీ అనసూయ మాత, అర్చకులు, వైదిక పాఠశాల విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు.