కాంగ్రెస్‌, బీజేపీ నుంచి టికెట్‌ రాకపోయినా బరిలో.. | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌, బీజేపీ నుంచి టికెట్‌ రాకపోయినా బరిలో..

Published Sat, Oct 21 2023 4:40 AM

- - Sakshi

సాక్షి, సిద్దిపేట: త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలవాలనుకుంటు న్న నేతలు టికెట్‌ రాకపోయినా పోటీ చేయాలనుకుంటున్నారు. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయడమా.. లేదంటే ఇతర రాజకీయ పార్టీ తరపున బరిలో నిలవడమా అని ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు నేతలు పోటా పోటీగా టికెట్ల కోసం ప్రయత్నిస్తు న్నారు. ఇండిపెండెంట్‌కు బదులు ఆలిండియా ఫార్వడ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్‌బీ) నుంచి అయితే ఎన్నికల గుర్తు సింహం కాబట్టి ప్రజల్లోకి వేగంగా వెళ్తుందని భావిస్తున్నారు.

ఆశావహులు ఎక్కువే..
జిల్లాలో ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్‌ అన్ని నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచే వారి టికెట్లను ప్రకటించి అభ్యర్థులకు బీఫాంలు సైతం అందజేసింది. బీజేపీ ఇప్పటివరకు ఒక్క లిస్టు సైతం విడుదల చేయలేదు. కాంగ్రెస్‌ ఈనెల 15న విడుదల చేసిన మొదటి జాబితాలో గజ్వేల్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని ప్రకటించింది. ఇంకా హు స్నాబాద్‌, దుబ్బాక, సిద్దిపేట, జనగామ ప్రకటించాల్సి ఉంది. హుస్నాబాద్‌ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వర్గంగా ప్రవీణ్‌రెడ్డి కొనసాగుతుండగా, కాంగ్రెస్‌ జాతీయ నేతల ద్వారా ప్రభాకర్‌ టికెట్‌ కోసం ప్రయత్నం చేస్తున్నారు. దుబ్బాక నుంచి ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కత్తి కార్తీక టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హుస్నాబాద్‌లో బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర హౌజ్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి ఇద్దరు పోటా పోటీగా ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు నేతలు నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

Advertisement
Advertisement