ఉప్పొంగిన ఉత్సాహం | Sakshi
Sakshi News home page

ఉప్పొంగిన ఉత్సాహం

Published Fri, Nov 10 2023 6:54 AM

-

గజ్వేల్‌: నామినేషన్‌ వేసేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. నియోజకవర్గంలోని గజ్వేల్‌, ములుగు, వర్గల్‌, జగదేవ్‌పూర్‌, మర్కూక్‌, కొండపాక, కుకునూర్‌పల్లి, తూప్రాన్‌, మనోహారాబాద్‌ మండలాల నుంచి కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. అంతకుముందు పట్టణంలో వేలాది బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత హెలిపాడ్‌ కోసం ఏర్పాటు చేసిన హౌసింగ్‌ బోర్డు మైదానం వద్దకు చేరుకున్నారు. సీఎం ఎర్రవల్లి ఫాంహౌస్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 11గంటల ప్రాంతంలో హౌసింగ్‌ బోర్డు మైదానానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. కేసీఆర్‌ సమీప బంధువు మాజీ జెడ్పీ చైర్మన్‌, సీనియర్‌ నాయకులు లక్ష్మీకాంతారావు, ప్రతాప్‌రెడ్డి, హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ భూంరెడ్డి, నాచారం ట్రస్ట్‌ బోర్డు మాజీ చైర్మన్‌ కొట్టాల యాదగిరిలు ప్రత్యేక వాహనంలో ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌(ఐఓసీ)లోని ఆర్‌డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. కేసీఆర్‌ రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బన్సీలాల్‌కు అందజేశారు. పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అధికారులు కేసీఆర్‌తో ఎన్నికల ప్రతిజ్ఞ చేయించారు. కేసీఆర్‌ అభ్యర్థిత్వాన్ని వెంట వచ్చిన నాయకులు బలపరిచారు.

Advertisement
Advertisement