కోహెడరూరల్ (హుస్నాబాద్): కొడుకును కాపాడుకునే క్రమంలో ఓ తండ్రి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మండల పరిధిలోని సింగరాయ ప్రాజెక్టు సమీపంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నంగునూరు మండల కేంద్రానికి చెందిన యాదగిరి గౌడ్(45) గురువారం తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగ సందర్భంగా నదీ స్నానాల కోసం కోహెడ మండలంలోని సింగరాయ్య ప్రాజెక్టు లొద్దులోకి వెళ్లారు. అందరూ కలిసి స్నానం చేస్తుండగా యాదగిరి కుమారుడు నీటిలో మునుగుతుండటం చూసి తనకు ఈత రాపోయినా ఒక్కసారిగా గుంతలోకి దూకాడు. కుమారుని కాపాడి తాను నీటిలో మునిగిపోయాడు. భర్త మునిగిపోవడం చూసిన భార్య సైతం నీటిలో దూకింది. తల్లి నీటిలో మునిగిపోతుండటంతో పక్కనే ఉన్న కుమార్తె చీరను అందివ్వగా బయటకు వచ్చింది. కానీ భర్తను కాపాడుకోలేకపోయింది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న కుటుంబం ఒక్కసారిగా శ్రోకసంద్రంలో మునిగిపోయింది. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈఘటనపై స్థానికులు పోలిసులకు సమాచారం అందించారు.