గజ్వేల్: ఉద్యోగాల కల్పనలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఏఐసీసీ అధికార ప్రతినిధి లావణ్య భల్లాల్ ఆరోపించారు. మంగళవారం గజ్వేల్లో కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. పరీక్షా పత్రాల లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటోందని మండిపడ్డారు. తన కుటుంబంలో అందరికీ పదవులిచ్చిన కేసీఆర్ నిరుద్యోగులను పట్టించుకోవడం లేదన్నారు. నియోజకవర్గ ప్రజలకు సీఎం అందుబాటులో ఉండకపోవడం వల్ల వారి సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని అన్నారు. అధికార పార్టీ అసంబద్ద విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు.