దుబ్బాక: గ్యాస్ సిలిండర్ పేలి పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటన దుబ్బాక పట్టణంలోని 13వ వార్డులో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వార్డులో చెక్కపల్లి రాజు కూలీ పని చేసుకుంటూ.. భార్య సౌందర్య, ఇద్దరు కూతుళ్లు, కొడుకుతో పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్నాడు. వ్యక్తిగత పని నిమిత్తం గుడిసెకు తాళం వేసి కుటుంబసభ్యులతో బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో గుడిసే మొత్తం దగ్ధమైంది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా అప్పటికే గుడిసె కుప్పకూలిపోయింది. గుడిసెలో ఉన్న వంట సామగ్రి, నిత్యావసర వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గుడిసె పక్కన నూతన ఇళ్లు నిర్మాణం చేపట్టానని నిర్మాణ అవసరాలకు గుడిసెలో ఉంచిన రూ. 2 లక్షల నగదుతోపాటు రూ.3 లక్షల విలువైన సామగ్రి దగ్ధమైందని బాధితుడు రాజు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు. ఘటన స్థలాన్ని ఆర్ఐ నర్సింహ రెడ్డి పరిశీలించి పంచనామా నిర్వహించి పై అధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు.