Sakshi News home page

‘క్లీన్‌స్వీప్‌’పై భారత్‌ గురి

Published Wed, Jan 17 2024 6:06 AM

3rd T20I: India seek T20 perfection in final match against Afghanistan - Sakshi

బెంగళూరు: టి20 ప్రపంచకప్‌కు ముందు భారత్‌ ఆఖరి అంతర్జాతీయ టి20 సమరానికి సన్నద్ధమైంది. అఫ్గానిస్తాన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఇప్పటికే 2–0తో సిరీస్‌ చేజిక్కించుకున్న భారత్‌కు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌ కీలకం కాదు! కానీ రెండు మ్యాచ్‌ల్లోనూ ఖాతా తెరవలేకపోయిన రోహిత్‌... ఈ సిరీస్‌ బరిలోకి దిగిన కోహ్లిలకు మాత్రం కీలకమే! తర్వాత అన్నీ ఐపీఎల్‌ మ్యాచ్‌లే ఉండటంతో పొట్టి ఫార్మాట్‌లో వీరిద్దరు గట్టి స్కోర్లు చేసేందుకు ఈ మ్యాచ్‌ను బాగా సది్వనియోగం చేసుకోవాలి.

కాబట్టి సులువైన ప్రత్యర్థిపై టీమిండియా ఆదమరిచే ఆలోచనే ఉండబోదు. యువ ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం, బౌలింగ్‌ పదునెక్కడంతో భారత్‌ 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. అయితే ఈ ఫార్మాట్‌ దృష్ట్యా అఫ్గానిస్తాన్‌ను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. పైగా పుష్కలమైన ఆల్‌రౌండ్‌ ఆటగాళ్లున్న ప్రత్యర్థి తప్పకుండా పరువు కోసం పోరాడుతుంది.
 
దూబేను ఆపతరమా...
ఈ సిరీస్‌లో శివమ్‌ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ అజేయంగా అర్ధ సెంచరీలు బాదాడు. షాట్ల ఎంపిక, విరుచుకుపడిన తీరు చూస్తుంటే మిడిలార్డర్‌లో భర్తీ చేయదగ్గ బ్యాటర్‌లా ఉన్నాడు. యశస్వి జైస్వాల్‌కు వచి్చన ఏకైక అవకాశాన్ని వినియోగించుకోగా, కెపె్టన్‌ రోహిత్‌ శర్మ పరుగుల పరంగా ఈ సిరీస్‌కు బాకీ పడ్డాడు. జితేశ్‌ శర్మ, రింకూ సింగ్‌ ఇలా చెప్పుకుంటూ పోతే భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌కు ఏ ఢోకా లేదు. అలాగే బౌలింగ్‌ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. పేస్‌తో అర్‌‡్షదీప్, ముకేశ్‌ కుమార్‌... స్పిన్‌తో అక్షర్‌ పటేల్, రవి బిష్ణోయ్‌ అదరగొడుతున్నారు. మరోవైపు అఫ్గాన్‌ పరిస్థితే పూర్తి భిన్నంగా ఉంది. నిలకడలేని బ్యాటింగ్‌ ఆర్డర్‌ జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సిరీస్‌ కోల్పోయిన ప్రత్యర్థి జట్టు ఆఖరి గెలుపుతో ఊరట చెందాలని గంపెడాశలతో బరిలోకి దిగుతోంది.

Advertisement
Advertisement