Sakshi News home page

IPL 2023: క్రికెట్‌లో కొత్త పంథా.. ఐపీఎల్‌ 2023 నుంచే మొదలు

Published Tue, Mar 7 2023 5:12 PM

BIG Rule Change In IPL 2023 DRS Can Be Taken On Wides-No-Balls - Sakshi

ఐపీఎల్‌ జట్లకు గుడ్‌న్యూస్. తాజాగా మొదలుకానున్న ఐపీఎల్‌ 16వ సీజన్‌ నుంచి డీఆర్‌ఎస్‌ను మరింత విస్తరించనున్నారు. ఔట్‌, నాటౌట్‌కే కాకుండా ఇకపై నోబాల్‌, వైడ్‌ బాల్‌కు ఆటగాళ్లు సమీక్ష కోరేలా రూల్స్‌ మార్చారు. అయితే ఈ నిబంధనను ఇప్పటికే వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL 2023)లో ఉపయోగిస్తున్నారు.

శనివారం ప్రారంభమైన డబ్ల్యూపీఎల్‌ తొలి ఎడిషన్‌లో గుజరాత్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ వైడ్‌ బాల్‌ విషయంలో డీఆర్‌ఎస్‌ కోరింది. ఈ ఫలితం హర్మన్‌కు అనుకూలంగా వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పోరులోనూ ఈ రూల్‌ను వాడారు. మేఘన్‌ షూట్‌ ఫుల్‌టాస్‌గా వేసిన డెలివరీని అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించలేదు. దాంతో బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ సమీక్ష కోరింది. అయితే సఫలం కాలేదు. యూపీ వారియర్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచులోనూ ఇలాంటి సమీక్షే కోరారు.

ఒక్కోసారి అంపైర్‌ తీసుకొనే ఒక తప్పుడు నిర్ణయంతో మ్యాచ్‌ గమనమే మారిపోతుంది. కొన్నిసార్లు గెలవాల్సిన మ్యాచ్‌లు ఓడిపోవాల్సి వస్తోంది.  గతంలో ఇన్నింగ్స్‌ ఆఖరి బంతులు నోబాల్‌ అయినా అంపైర్లు ఇవ్వకపోవడంతో భారీ విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ఆటగాళ్లు ఔటై పెవిలియన్‌కు చేరారు ఇకపై ఇలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు, ఆటగాళ్లకు మరో అవకాశం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో నోబాల్‌, వైడ్‌ బాల్‌ కోసం సమీక్ష కోరేలా నిబంధనలు సవరించింది.

''మైదానంలోని అంపైర్లు తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని క్రికెటర్లు కోరొచ్చు. బ్యాటర్‌ ఔటయ్యారో లేదో తెలుసుకోవచ్చు. వైడ్‌ బాల్‌, నోబాల్‌ విషయంలోనూ ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై సమీక్ష అడగొచ్చు'' అని డబ్ల్యూపీఎల్‌ నిబంధనల్లో పేర్కొన్నారు. రానున్న ఐపీఎల్‌ 2023 సీజన్‌లోనూ ఈ రూల్‌ వర్తించనుంది.

చదవండి: పిచ్‌తో మైండ్‌గేమ్‌.. కలవరపడుతున్న 'కంగారూలు'

Advertisement
Advertisement