Cooling Off Period For Retired Cricketers Would Be Uncomfortable And Unfair: Robin Uthappa - Sakshi
Sakshi News home page

రిటైరయ్యాక కూడా విదేశీ లీగ్‌ల్లో ఆడొద్దంటే ఎలా..? బీసీసీఐ అంక్షలపై రాబిన్‌ ఉతప్ప ఫైర్‌

Published Thu, Aug 10 2023 4:57 PM

Cooling Off Period For Retired Cricketers Would Be Uncomfortable And Unfair Says Robin Uthappa - Sakshi

రిటైరయ్యాక కూడా భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనకుండా ఉండేందుకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) త్వరలో ఓ కొత్త నిబంధనను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌గా పిలువబడే ఈ నిబంధన అమల్లోకి వస్తే భారత ఆటగాళ్లు రిటైరయ్యాక కూడా విదేశీ లీగ్‌ల్లో పాల్గొనడానికి వీలు ఉండదు. ఈ నిబంధనపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ.. దీన్ని త్వరలోనే అమల్లోకి తెస్తారని ప్రచారం జరుగుతుంది.

ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్‌, డాషింగ్‌ ఆటగాడు రాబిన్‌ ఉతప్ప స్పందించాడు. బీసీసీఐ గనక ఈ నిబంధనను అమల్లో తెస్తే ఇప్పుడిప్పుడే రిటైర్డ్‌ అయిన క్రికెటర్లు చాలా నష్టపోతారని అన్నాడు. కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ అన్నది రిటైర్డ్‌ క్రికెటర్లకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుందని, ఇది చాలా అన్యామని తెలిపాడు. భారత రిటైర్డ్‌ క్రికెటర్లకు బీసీసీఐతో ఎలాంటి కాంట్రాక్ట్‌ ఉండదు కాబట్టి,  ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏ లీగ్‌లో అయినా పాల్గొనే హక్కు వారికి ఉంటుంది, ఈ విషయంలో బీసీసీఐ కఠినంగా వ్యవహరించదని అనుకుంటున్నా అంటూ ఇటీవల పీటీఐతో మాట్లాడుతూ అన్నాడు. ఈ విషయంలో బీసీసీఐ ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తుందని భావిస్తున్నానని తెలిపాడు.

కాగా, ఐపీఎల్‌ మినహా ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్‌ల్లో పాల్గొనేందుకు బీసీసీఐతో ఒప్పంద ఉన్న భారత క్రికెటర్లకు అనుమతి లేదన్న విషయం తెలిసిందే. విదేశీ లీగ్‌ల్లో పాల్గొనేందుకు ఉన్ముక్త్‌ చంద్‌ లాంటి క్రికెటర్లు బీసీసీఐతో తెగదెంపులు చేసుకున్నారు. ప్రస్తుతం బీసీసీఐతో ఎలాంటి అనుబంధం లేని భారత మాజీ క్రికెటర్లు (ఉతప్ప, పఠాన్‌ సోదరులు, శ్రీశాంత్‌, పార్థివ్‌ పటేల్‌, స్టువర్ట్‌ బిన్ని) పలు విదేశీ లీగ్‌ల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు బీసీసీఐ ఈ విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలని భావించాలని తెలుస్తుంది.

భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో పాల్గొంటే ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్‌ పడిపోతుందని భావిస్తున్న బీసీసీఐ, రిటైర్డ్‌ ఆటగాళ్లను విదేశీ లీగ్‌ల్లో పాల్గొనకుండా అంక్షలు విధిస్తుంది. ఇందులో భాగంగానే కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ నిబంధనను అమల్లోకి తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌పై స్పందించిన రాబిన్‌ ఉతప్ప అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉతప్ప ఇటీవల ముగిసిన జింబాబ్వే టీ10 లీగ్‌లోనూ, అంతకుముందు యూఏఈలో జరిగిన ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లోనూ పాల్గొన్నాడు.

Advertisement
Advertisement