ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ పేసర్‌కు బీసీసీఐ మందలింపు | Sakshi
Sakshi News home page

ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ పేసర్‌కు బీసీసీఐ మందలింపు

Published Thu, Apr 25 2024 4:44 PM

DC Rasikh Salam Dar Reprimanded For Breaching IPL Code Of Conduct During

ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ పేసర్‌ రసీఖ్‌ సలాం దర్‌ను బీసీసీఐ మందలించింది. ఐపీఎల్‌-2024లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అతి చేసినందుకు వార్నింగ్‌ ఇచ్చింది. ఇంకోసారి ఇలాంటివి పునరావృతం చేయకూడదని హెచ్చరించింది.

కాగా ఢిల్లీ వేదికగా టైటాన్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రసీఖ్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసిన ఈ రైటార్మ్‌ పేసర్‌ 44 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. సాయి సుదర్శన్‌(39 బంతుల్లో 65), షారుఖ్‌ ఖాన్‌(8), రవిశ్రీనివాసన్‌ సాయి కిషోర్‌(13)లను అవుట్‌ చేశాడు. 

ముఖ్యంగా లక్ష్య ఛేదనలో ప్రమాదకారిగా మారుతున్న సాయి సుదర్శన్‌ను పెవిలియన్‌కు పంపడం ద్వారా రసీఖ్‌ మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పాడు. అలా ఢిల్లీ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు 24 ఏళ్ల ఈ కశ్మీరీ ఎక్స్‌ప్రెస్‌.

అయితే, వికెట్‌ తీసిన ప్రతిసారీ రసీఖ్‌ కాస్త వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. దీంతో బీసీసీఐ అతడిని మందలించింది. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఈమేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.

కాగా అరుణ్‌ జైట్లీ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ గుజరాత్‌పై 4 పరుగుల తేడాతో గట్టెక్కింది. టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.

అయితే, లక్ష్య ఛేదనలో గుజరాత్‌ టైటాన్స్‌ ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఎనిమిది వికెట్లు నష్టపోయి 220 పరుగుల వద్ద నిలిచి ఓటమి పాలైంది.

Advertisement
Advertisement