‘మారడోనాను డాక్టర్లే చంపారు.. ఆయనను అస్సలు పట్టించుకోలేదు’ | Sakshi
Sakshi News home page

మారడోనా మృతిపై అర్జెంటీనా నర్సు సంచలన ఆరోపణలు

Published Thu, Jun 17 2021 3:06 PM

Doctors Killed Diego Maradona Via Negligence Says His Nurse Lawyer - Sakshi

బ్వేనోస్ ఎయిరెస్: ఫుట్ బాల్ మాంత్రికుడు, అర్జెంటీనా దివంగత ఆటగాడు డీగో మారడోనాను డాక్టర్లే చంపారని ఆయనకు వైద్యం చేసిన నర్సు సంచలన ఆరోపణలు చేసింది. కేవలం వారి నిర్లక్ష్యం కారణంగానే మారడోనా మృతి చెందాడని, చివరి రోజుల్లో డాక్టర్లు అతన్ని అస్సలు పట్టించుకోలేదని మారడోనా అనుమానాస్పద మృతి కేసులో విచారణ ఎదుర్కొంటున్న దహియానా గిసెలా మాడ్రిడ్ అనే నర్సు పేర్కొంది. ఈ విషయాన్ని ఆమె తన లాయర్‌ ద్వారా వెల్లడించింది.  కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూటర్ అడిగిన ప్రశ్నలకు నర్సు తరపు న్యాయవాది స్పందిస్తూ.. మారడోనా బ్రెయిన్ సర్జరీ నుంచి కోలుకున్నాక కూడా ఏ డాక్టరూ ఆయన ఆరోగ్య స్థితిని పరీక్షించలేదని తన క్లయింటు చెప్పినట్లు పేర్కొన్నాడు.

హాస్పిటల్‌లో మారడోనా కింద పడిపోయినప్పుడు తన క్లయింట్‌ ఆయనకు వెంటనే సీఏటీ స్కాన్ చేయాలని చెప్పినప్పటికీ అక్కడే ఉన్న డాక్టర్ స్పందించలేదని,  ఈ విషయం మీడియాకు తెలిస్తే రచ్చ చేస్తారని సదరు డాక్టర్‌ తన క్లయింట్‌తో చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఏ డాక్టర్ కూడా మారడోనా మరణాన్ని ఆపలేకపోయారని, అయన చివరి రోజుల్లో తన క్లయింటే అతని బాగోగులు చూసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, మారడోనా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని, అతని సంతానం​ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో  మారడోనా వ్యక్తిగత వైద్యునితో సహా ఏడుగురిని ప్రాసిక్యూట్ చేస్తున్నారు. వారిలో మాడ్రిడ్ అనే నర్సు కూడా ఒకరు. మారడోనా గతేడాది నవంబరులో 60 ఏళ్ళ వయస్సులో గుండెపోటుతో ఆర్జెంటీనాలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో మృతి చెందారు.
చదవండి: గ్రౌండ్‌లో కుప్ప‌కూలిన మరో స్టార్‌ ప్లేయర్‌..

Advertisement
Advertisement