Duleep Trophy 2023: North Zone move closer to victory over North East Zone - Sakshi
Sakshi News home page

రాణించిన మంత్రి.. తిప్పేసిన సౌరభ్‌ కుమార్‌

Published Sat, Jul 1 2023 7:01 AM

Duleep Trophy 2023: Central And North Zones Closer To Victory - Sakshi

బెంగళూరు: దులీప్‌ ట్రోఫీ క్వా­ర్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో సెంట్రల్‌ జోన్, నార్త్‌జోన్‌ జట్లు గెలుపు దిశగా పయనిస్తున్నాయి. ఈస్ట్‌జోన్‌తో జరుగుతున్న పోరులో సెంట్రల్‌ ఆటగాళ్లు  హిమాన్షు మంత్రి (68; 7 ఫోర్లు), వివేక్‌ సింగ్‌ (56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాటింగ్‌లో రాణించగా, సౌరభ్‌ కుమార్‌ (4/33) స్పిన్‌ బౌలింగ్‌తో తిప్పేశాడు. శుక్రవారం 64/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటప్రారంభించిన సెంట్రల్‌జోన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 87.5 ఓవర్లలో 239 పరుగుల వద్ద ఆలౌటైంది.

ఓపెనర్లు హిమాన్షు మంత్రి, వివేక్‌సింగ్‌ తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించారు.  అనంతరం 300 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన ఈస్ట్‌జోన్‌ సౌరభ్‌ స్పిన్‌ ఉచ్చులో పడింది. ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 69 పరుగులే చేసింది.  

నార్త్‌ ఆల్‌రౌండ్‌ దెబ్బకు... 
నార్త్‌జోన్‌ ఆల్‌రౌండ్‌ దెబ్బకు నార్త్‌ ఈస్ట్‌జోన్‌ కుదేలైంది. దీంతో మూడో రోజు ఆటలోనే నార్త్‌ ఈస్ట్‌జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లను కోల్పోయింది. మొదట 65/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన నార్త్‌ ఈస్ట్‌జోన్‌ 39.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది.

దీంతో నార్త్‌కు 406 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను నార్త్‌జోన్‌ 55.1 ఓవర్లలో 259/6 వద్ద డిక్లేర్‌ చేసింది. ప్రభ్‌ సిమ్రన్‌సింగ్‌  (59; 9 ఫోర్లు, 1 సిక్స్‌), అంకిత్‌ (70; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. దీంతో ప్రత్యర్థికి 666 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, నార్త్‌ ఈస్ట్‌జోన్‌ ఆట నిలిచే సమయానికి 18 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది.   
 

Advertisement
Advertisement