పాక్‌ మూలాలు ఉన్న ఇంగ్లండ్‌ స్పిన్నర్‌కు ఎట్టకేలకు భారత వీసా | Sakshi
Sakshi News home page

IND VS ENG 1st Test: కథ సుఖాంతం.. పాక్‌ మూలాలు ఉన్న ఇంగ్లండ్‌ స్పిన్నర్‌కు ఎట్టకేలకు భారత వీసా మంజూరు 

Published Thu, Jan 25 2024 8:20 AM

England Cricketer Shoaib Bashir Gets Indian Visa Finally After UK Govt Intervened - Sakshi

భారత వీసా లభించకపోవడంతో తొలి టెస్టుకు దూరమైన ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌కు ఊరట లభించింది. వీసా లేకపోవడంతో అతను జట్టుతో పాటు భారత్‌కు ప్రయాణించకుండా యూఏఈ నుంచి ఇంగ్లండ్‌కు వెనక్కి వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు బషీర్‌కు వీసా మంజూరైందని గురువారం ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. ‘బషీర్‌ తన వీసా అందుకున్నాడు.

ఈ వారాంతంలో భారత్‌కు వచ్చి అతను జట్టుతో కలుస్తాడు. సమస్య పరిష్కారం కావడంతో సంతోషంగా ఉంది’ అని ఈసీబీ వెల్లడించింది. ఇంగ్లండ్‌లో పుట్టినా... పాకిస్తాన్‌ మూలాలు ఉన్న కారణంగానే బషీర్‌ వీసాను భారత ప్రభుత్వం ఆలస్యం చేసిందని గత రెండు రోజులుగా విమర్శలు వచ్చాయి. ఇంగ్లండ్‌ ప్రభుత్వ అధికారి కూడా ఒకరు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేయగా... ఇప్పుడు అంతా సుఖాంతమైంది. 20 ఏళ్ల ఆఫ్‌ స్పిన్నర్‌ బషీర్‌ ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు. ఒకవేళ బషీర్‌ జట్టుతో పాటు భారత్‌కు చేరుకుని ఉంటే ఇంగ్లండ్‌ తుది జట్టులో అతను ఉండేవాడు.

ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ కోస​ం ఇంగ్లండ్‌ తమ తుది జట్టును నిన్ననే ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. రెహన్‌ అహ్మద్‌, జాక్‌ లీచ్‌, టామ్‌ హర్ట్‌లీలతో కూడిన ఇంగ్లండ్‌ స్పిన్‌ త్రయం భారత బ్యాటర్లను ఢీ కొట్టనుంది. 

భారత్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు:  జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), బెన్ ఫోక్స్ (వికెట్‌ కీపర్‌), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్
 

Advertisement

తప్పక చదవండి

Advertisement