Robin Uthappa: ఐపీఎల్ వేలం గురించి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వేలం జరిగే తీరు అస్సలు బాగోలేదని, అది చూసినప్పుడు సంతలో పశువుల వేలాన్ని చూసిన ఫీలింగ్ కలుగుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీపడుతుంటే.. ఏదో వస్తువు కోసం పోటీ పడుతున్న దారుణమైన ఫీలింగ్ కలుగుతుందని, వేలం సమయంలో ఆటగాళ్లు కూడా మనుషులేనన్న విషయాన్ని ఫ్రాంచైజీలు మరిచిపోయి ప్రవర్తిస్తాయని వాపోయాడు.
వేలంలో‘అమ్ముడుపోని ఆటగాళ్ల మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఎవరూ ఊహించలేరని, అది వర్ణించలేని బాధ కలిగిస్తుందని అన్నాడు. ఆటగాళ్ల కోసం వేలం భారత్లో మాత్రమే జరుగుతుందని, మున్ముందు ఈ ప్రక్రియకు స్వస్థి పలికితే బాగుంటుందని, అందరికీ మేలు జరిగేలా ముసాయిదా విధానం అమలులోకి వస్తే చాలా గౌరవప్రదంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
కాగా, ఐపీఎల్ 2022 మెగా వేలంలో రాబిన్ ఉతప్పను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 2 కోట్ల బేస్ ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్లో కూడా అతను ఇదే జట్టుకే ఆడాడు. సీఎస్కే లాంటి జట్టుకు ఆడాలన్నది తన కోరిక అని, అందు కోసం తాను, తన కొడుకు దేవుడిని ప్రార్ధిస్తున్నామని ఐపీఎల్ 2022 వేలానికి ముందు ఓ ఇంటర్వ్యూలో ఉతప్ప పేర్కొన్నాడు. రాబిన్ ఉతప్ప 2006 నుంచి 2015 మధ్యకాలంలో భారత్ తరఫున 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు.
చదవండి: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన టీమిండియా క్రికెటర్