16 Year Old Tanmay Manjunath Creates History And Hits 407 Runs In 165 Balls With 48 Fours, 24 Sixes - Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన కర్ణాటక క్రికెటర్‌.. వన్డేల్లో 407 పరుగులు, రోహిత్‌ రికార్డు బద్ధలు

Published Mon, Nov 14 2022 10:11 AM

History Created, 16 Year Old Tanmay Manjunath Hits 407 Runs In 165 Balls With 24 Sixes - Sakshi

50 ఓవర్ల ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. కర్ణాటకలోని షిమోగలో జరిగిన అంతర్‌ జిల్లా అండర్‌-16 టోర్నీ ఓ అత్యంత అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. టోర్నీలో భాగంగా భద్రావతి-సాగర్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ యువ ఆటగాడు ఏకంగా క్వాడ్రాపుల్‌ సెంచరీ (నాలుగు వందల పరుగులు) బాదాడు. సాగర్‌ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తన్మయ్‌ మంజునాథ్‌ 165 బంతుల్లో.. 48 ఫోర్లు, 24 సిక్సర్ల సాయంతో 407 పరుగులు చేశాడు.

ఫలితంగా సాగర్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 583 పరుగులు చేసింది. అనంతరం అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భద్రావతి టీమ్‌ కేవలం 73 పరుగులకే కుప్పకూలి అత్యంత దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో క్వాడ్రాపుల్‌ సెంచరీతో చెలరేగిన తన్మయ్‌.. యాభై ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రికార్డును బద్ధలు కొట్టాడు.

అంతర్జాతీయ వన్డేల్లో ఏకంగా మూడు డబుల్‌ హండ్రెడ్స్‌ తన ఖాతాలో వేసుకున్న హిట్‌మ్యాన్‌.. శ్రీలంకపై 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 264 పరుగులు చేశాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోర్‌గా కొనసాగుతుంది. లిస్ట్‌-ఏ క్రికెట్‌ కూడా కలుపుకుంటే సర్రే-గ్లామోర్గన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏడీ బ్రౌన్‌ 268 పరుగులు సాధించాడు.    
చదవండి: 'త్వరలో టీ20లకు రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ ప్రకటించవచ్చు'

Advertisement
Advertisement