అలాంటి పిచ్‌లపై గెలవడం గొప్పేమీ కాదు.. | Sakshi
Sakshi News home page

అలాంటి పిచ్‌లపై గెలవడం గొప్పేమీ కాదు..

Published Sun, Mar 7 2021 5:16 PM

If India Beats England In England Grounds, Then Team India Becomes Team Of The Era Says Michael Vaughan - Sakshi

లండన్: ఇంగ్లీష్‌ జట్టుపై 3-1 తేడాతో గెలుపొందిన టీమిండియాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతుంటే.. ఇంగ్లండ్‌ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ మాత్రం టీమిండియాపై తన అక్కసును వెల్లగక్కుతున్నాడు. స్పిన్నర్లకు స్వర్గధామమైన భారత దేశపు పిచ్‌లపై టీమిండియా విజయాలు సాధించడం పెద్ద గొప్ప విషయమేమీ కాదని పేర్కొన్నాడు. స్వింగ్‌ బౌలింగ్‌కు అనుకూలించే ఇంగ్లండ్‌ గడ్డపై గెలిచినప్పుడే టీమిండియా అత్యుత్తమగా జట్టుగా నిలుస్తుందని వెల్లడించాడు. టీమిండియా విజయవరంపర ఇంగ్లండ్‌లోనూ కొనసాగితే.. ఈ శకంలోనే అత్యుత్తమ టెస్టు జట్టుగా నిలుస్తుందన్నాడు. స్వింగ్‌ బంతుల్ని ఎదుర్కొనేందుకు భారత ఆటగాళ్లు కష్టపడతారు కాబట్టే తాను ఈరకమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నానన్నాడు. 

టెస్టుల్లో టీమిండియా మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తున్నప్పటికీ.. ఆ జట్టుకు అధిక శాతం విజయాలు ఉప ఖండపు పిచ్‌లపైనే దక్కడం తన అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయన్నాడు. టెస్టు మ్యాచ్‌లు రెండు, మూడు రోజుల్లో పూర్తి కావడం సంప్రదాయ క్రికెట్‌కు ఏమాత్రం మంచిది కాదని అభిప్రాపడ్డాడు. మొటేరా వేదికగా శనివారం ముగిసిన ఆఖరి టెస్ట్‌లో కోహ్లీసేన ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించి, న్యూజిలాండ్‌తో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. జూన్‌లో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానం వేదిక కానుంది. 

Advertisement
Advertisement