IND VS ENG 1st Test: నిర్జీవమైన పిచ్‌పై నిప్పులు చెరిగిన బుమ్రా | Sakshi
Sakshi News home page

IND VS ENG 1st Test: నిర్జీవమైన పిచ్‌పై నిప్పులు చెరిగిన బుమ్రా

Published Sun, Jan 28 2024 12:32 PM

IND VS ENG 1st Test: Bumrah Took 6 Wickets On Spin Friendly Hyderabad Pitch - Sakshi

ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా సత్తా చాటాడు. బ్యాటింగ్‌కు, స్పిన్నర్లకు అనుకూలిస్తూ నిర్జీవంగా ఉన్న పిచ్‌పై నిప్పులు చెరిగే బంతులు సంధించి ఇంగ్లండ్‌ పతనాన్ని శాశించాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా రెండు ఇన్నింగ్స్‌ల్లో (2/28, 4/41) కలిపి మొత్తం ఆరు వికెట్లు పడగొట్టాడు.  బుమ్రా మినహా ఈ మ్యాచ్‌లో మరే ఇతర పేసర్ వికెట్లు పడగొట్టలేకపోయాడు.

సహచరుడు సిరాజ్‌, ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ కనీసం ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేని పిచ్‌పై బుమ్రా బుల్లెట్‌ లాంటి బంతులు సంధించి వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కేవలం​ ఒకే ఒక పేసర్‌తో బరిలోకి దిగగా.. భారత్‌ బుమ్రాతో పాటు సిరాజ్‌ను కూడా బరిలోకి దించింది. అయితే సిరాజ్‌ ఆశించినంతగా రాణించలేకపోయాడు. సిరాజ్‌ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు ఓవర్లు మాత్రమే వేశాడు.

మరోవైపు ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లు వేసినప్పటికీ ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. బుమ్రా చెలరేగడంతో ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్‌ (196) తృటిలో డబుల్‌ సెంచరీ చేజార్చుకున్నాడు. బుమ్రాతో పాటు అశ్విన్‌ (3/126), జడేజా (2/131), అక్షర్‌ పటేల్‌ (1/74) రాణించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేసిన ఇంగ్లండ్‌ భారత్‌ ముందు 230 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఉంచింది. 

ఇంగ్లండ్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (70) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.భారత బౌలర్లలో అశ్విన్‌, జడేజా తలో 3 వికెట్లు.. అక్షర్‌, బుమ్రా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులు చేసి ఆలౌటైంది. జడేజా (87), కేఎల్‌ రాహుల్‌ (86), యశస్వి జైస్వాల్‌ (80) రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రూట్‌ 4, రెహాన్‌ అహ్మద్‌, హార్ట్లీ తలో 2 వికెట్లు, లీచ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 
 

Advertisement
Advertisement