ఇదేందయ్యా ఇది.. ఇలా ఎప్పుడు చూడలే!.. రోహిత్‌ సీరియస్‌ | Sakshi
Sakshi News home page

Ind vs Eng: హైడ్రామా.. అలా నాటౌట్‌.. ఇలా కూడా నాటౌటేనా?.. రోహిత్‌ సీరియస్‌

Published Mon, Feb 5 2024 4:00 PM

Ind vs Eng 2nd Test: Baffled Rohit Confronts Umpire After Big DRS Drama - Sakshi

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. నాలుగో రోజు ఆటలో థర్డ్‌ అంపైర్‌ వ్యవహరించిన విధానానికి ఫీల్డ్‌ అంపైర్‌ను అడ్డగించాడు. అతడు వివరణ ఇచ్చిన తర్వాత అసంతృప్తిగా సహచరులతో కలిసి అక్కడి నుంచి కదిలాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. వైజాగ్‌ టెస్టులో సోమవారం నాటి ఆటలో భాగంగా టీమిండియా విజయానికి మూడు వికెట్ల దూరంలో ఉన్న సమయంలో.. ఇంగ్లండ్‌ టెయిలెండర్‌ టామ్‌ హార్లీని అవుట్‌ చేసే అవకాశం వచ్చింది.

62.5వ ఓవర్లో భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో టామ్‌ హార్లీ రివర్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడాడు. ఈ క్రమంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ చేతికి బంతి చిక్కింది. దీంతో ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ హార్లీని అవుట్‌గా ప్రకటించాడు.

ఎనిమిదో వికెట్‌ కూడా పడిందన్న సంబరంలో టీమిండియా ఉండగా.. హార్లీ రివ్యూకు వెళ్లాడు. ఈ క్రమంలో బాల్‌ ట్రాకింగ్‌లో.. బంతి తొలుత హార్లీ ముంజేతిని తాకి బ్యాట్‌కు తాకినట్లు కనిపించడంతో థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చారు. అయితే, ఎల్బీకి అప్పీలు చేయకపోయినా.. లెగ్‌ బిఫోర్‌ వికెట్‌ను థర్డ్‌ అంపైర్‌ ట్రాక్‌ చేసి.. అంపైర్స్‌ కాల్‌ ప్రకారం నాటౌట్‌ అని ప్రకటించింది.

దీంతో గందరగోళం నెలకొంది. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై భారత సారథి రోహిత్‌ శర్మ సహా అశ్విన్‌ విస్మయం చేస్తూ.. అంపైర్స్‌ కాల్‌ ప్రకారం ఇది అవుటే కదా.. నాటౌట్‌ ఎలా ఇస్తారు? అని మైదానంలో ఉన్న అంపైర్‌తో వాదనకు దిగారు.

ఇందుకు బదులిస్తూ.. ‘‘స్పిప్స్‌లో క్యాచ్‌ పట్టుకున్నపుడు నేను అవుట్‌​ ఇచ్చాను. ఎల్బీడబ్ల్యూకు కాదు’’ అని రోహిత్‌ సేనకు సదరు ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ బదులిచ్చాడు. ఏదేమైనా ఈ విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది టీమిండియా. ఈ హైడ్రామాకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘ఇలాంటి డీఆర్‌ఎస్‌ ఎప్పుడూ చూడలేదు.. క్యాచ్‌ విషయంలో అంపైర్స్‌ కాల్‌ రివర్స్‌ అంటూ నాటౌట్‌ ఇచ్చారు. ఎల్బీకి అప్పీలు చేయకపోయినా.. మరోసారి అదే అంపైర్స్‌ కాల్‌ పేరు చెప్పి ఈసారీ నాటౌట్‌ ఇచ్చారు. చిత్రంగా ఉంది’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో భారత జట్టు నాలుగో రోజే ఆట ముగించి ఇంగ్లండ్‌ను 106 పరుగుల తేడాతో చిత్తు చేసింది.  

Advertisement
Advertisement